ఏపి శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కేవలం మూడు రోజులే సమావేశాలు నిర్వహించాలనుకొన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన వైకాపా, కనీసం ఆ మూడు రోజులైనా సమావేశాలు జరుగకుండా అడ్డుకోవడంతో స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావు శాసనసభ సమావేశాలని నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. చివరి రోజైన ఈరోజు కూడా శాసనసభ సమావేశాలు మొదలవగానే యధాప్రకారం వైకాపా సభ్యులు అందరూ స్పీకర్ పోడియంని చుట్టుముట్టి , ప్రత్యేక హోదాపై సభలో చర్చకి అనుమతించాలంటూ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు జరుగకుండా స్తంభింపజేశారు. వారిని సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలని నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ స్పీకర్ సమావేశాలని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రత్యేక హోదాపై శాసనసభలో చర్చ జరపాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంతగా పట్టుబడుతున్నప్పుడు ప్రభుత్వం అందుకు అనుమతించి ఉంటే చాలా హుందాగా ఉండేది. కానీ ప్రకటన తరువాతే చర్చ జరపడం ఆనవాయితీ అంటూ రూల్స్ మాట్లాడి చర్చకి అనుమతించకపోవడం వలన సభలో ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనేందుకు భయపడిందనే భావన ప్రజలకి కల్పించింది. ప్రతిపక్ష పార్టీకి నియమనిబంధనలు తెలియకపోవచ్చు కానీ అవన్నీ మన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకొన్నవే అయినపుడు, వైకాపా కోరికని మన్నించి సభలో ప్రత్యేక హోదాపై చర్చకి అనుమతిస్తే కొంపలు మునిగిపోవు కదా? ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజి పుచ్చుకొన్నందుకు ఇప్పటికే తెదేపా ప్రజాగ్రహం చవిచూస్తోంది. ఇప్పుడు శాసనసభలో దానిపై చర్చకి వెనకాడటం ద్వారా తనలో అపరాధభావం స్వయంగా బయట పెట్టుకొన్నట్లయింది. ఈ విషయం నిరూపించడంలో వైకాపా విజయం సాధించిందనే చెప్పవచ్చు.
ఇక సభలో వైకాపా తీరు ఏమాత్రం సమర్ధనీయంగా లేదు. ముఖ్యంగా స్పీకర్ పట్ల ఆ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరుకి సభలోనే ఉన్న వారి నేత జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలవంచుకోవలసిందిపోయి ఆయన కూడా స్పీకర్ ని ఉద్దేశ్యించి తీవ్రంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుంది వారి తీరు. వైకాపా సభ్యులు ఈ మూడు రోజులు శాసనసభలో ప్రజాసమస్యల కోసం పోరాడలేదు. ఆ పేరుతో తెదేపాతో రాజకీయ పోరాటం చేశారు. ఇటువంటి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తే మాత్రం ఏమి ప్రయోజనం? ఆ రెండు పార్టీల ప్రతినిధులు మళ్ళీ శాసనసభ బయట మీడియా పాయింట్ వద్ద కూడా ఘర్షణ పడి రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుతో తలవంచుకొనే పరిస్థితి కల్పించారు.
శాసనసభలో వారి పోరాటాలు ముగిసిపోయాయి కనుక ఇక నేటి నుంచి బయట పోరాటాలు మొదలు పెడతారు. నేడు రాష్ట్ర బంద్ జరుగుతోంది కనుక అందుకు అనువైన రాజకీయ వాతావరణం కూడా సిద్దంగానే ఉంది.