ఆంధ్రప్రదేశ్ నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెనువెంటనే నెరవేరుస్తూ, ఏప్రిల్ 1 నుంచే ఉచిత విద్యుత్ పథకాన్నిఅమలు చేయనున్నట్లుగా ప్రకటించింది. మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా కొండంత అండగా ఉండనుంది.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు అదనపు భారాన్ని భరిస్తూ, నేతన్నల కష్టార్జితాన్ని మిగిల్చే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640 వరకు, పవర్ లూమ్ యూనిట్లకు రూ. 21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, విద్యుత్ ఛార్జీల భారం నుంచి చేనేత కళాకారులను విముక్తం చేసి, వారి వృత్తిని గౌరవప్రదంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
కేవలం విద్యుత్ రాయితీ మాత్రమే కాకుండా, నేతన్నల పెన్షన్ను 4 వేలకు* పెంచడం, త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదల, ఆధునిక యంత్రాలపై 90 శాతం రాయితీ వంటి చర్యలతో కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తోంది. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలతో మార్కెటింగ్ అనుసంధానం చేయడం ద్వారా నేతన్నల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చేయడం గొప్ప పరిణామం. నేతన్నకు చేదోడు గా ఉంటూ, వారి కళ్ళలో ఆనందం చూడటమే లక్ష్యంగా సాగుతున్న ప్రజా ప్రభుత్వం నిజంగానే చేనేతలకు పవర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.
