ఏపీ విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీరుపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఆయన పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి హైబ్రీడ్ మోడల్ ను ఏకి పారేసిన వైనాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. విభజనపై మాట్లాడిన మాటలను ఖండించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వరుసగా రంగంలోకి దిగారు.
మొదట మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టారు. తేజస్వీ సూర్యపై విరుచుకుపడ్డారు. ఆయనను వెధవ అని కూడా సంబోధించారు. ఆయన అలా మాట్లాడుతూంటే బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తేజస్వీసూర్య పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలన్నారు. తర్వాత హరీష్ రావు కూడా ప్రెస్మీట్ పెట్టి తేజస్వీ సూర్యపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పోరాటం గురించి ఆయనకు తెలియదన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు.
తేజస్వీ సూర్య బీజేపీకి చెందిన ఎంపీ కావడంతో ఆయన మాటల్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. అయితే కాంగ్రెస్ విభజన చేసిన తీరును మాత్రమే తేజస్వీ సూర్య ప్రస్తావించారని బీజేపీ నేతలంటున్నారు. బీజేపీని కార్నర్ చేయడానికి తేజస్వీ సూర్య అవసరమైన కంటెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడా టాపిక్ పై ప్రజలకు ఆసక్తి ఉందా లేదా అన్నదే కీలకం.
