జాతీయ గీతంపై వివాదాస్పద ట్వీట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ శివార్లలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈమేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. సినిమా థియేటర్లలో జాతీయ గీత ప్రదర్శన తప్పనిసరిచేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన అవమానించారంటూ జనార్దన్ గౌడ్ అనే న్యాయవాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్ తన ట్వీట్ల పరంపరలో భాగంగా జాతీయ గీతంపై ట్విటర్లో తన కామెంట్ ను పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో సరదాగా సినిమాకు వెళ్తే అక్కడ దేశ భక్తిని నిరూపించుకోవాల్సి వస్తోందని కామెంట్ చేశారు. సినిమా హాళ్లు దేశభక్తి ప్రదర్శనకు వేదికలు కారాదని వ్యాఖ్యానించారు.
నిజానికి ఇది బీజేపీనో, కేంద్ర ప్రభుత్వమో ఇచ్చిన ఆదేశం కాదు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. ఈ తీర్పునే తప్పు పట్టే విధంగా ఆయన కామెంట్ చేయడంపై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐ ఆర్ నమోదైంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య పైనా పవన్ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఆయన బీజేపీని విమర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ఒక స్టాండ్ తీసుకుని బీజేపీని విమర్శించడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోవడం విశేషం.