అప్పుడు బొమ్మాలీ అంటూ దడ పుట్టించిన రవిశంకర్ ఇప్పుడు ‘రాజరథం’ లో ‘చల్ చల్ గుర్రం’ అంటూ రాబోతున్నారు

‘రాజరథం’ నుండి ముచ్చటగా మూడో పాట ‘చల్ చల్ గుర్రం’ నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న ‘రాజరథం’ ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవి శంకర్ మొట్ట మొదటి సారి ‘రాజరథం’ లో తాను పోషిస్తున్న ‘అంకుల్’ పాత్ర కోసం ‘చల్ చల్ గుర్రం’ పాట పాడారు. ఈ పాటని మహాబలేశ్వర్, పూణే లో ని మాల్షెజ్ ఘాట్ వంటి అందమైన ప్రదేశాలలో కనువిందుగా చిత్రీకరించారు. దర్శకుడు అనూప్ భండారి సహజమైన మంచు కోసం మాల్షెజ్ ఘాట్ ని ఎంచుకున్నారు. ఒకోసారి మంచు తీవ్రత తగ్గేవరకూ ఆగి షూటింగ్ చేసుకోవాల్సి వచ్చేది.

‘రాజరథం’ కోసం దిలీప్ రాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసిన పాతకాలపు సైడ్ కార్ ఉండే స్కూటర్ ఈ పాటకి అదనపు ఆకర్షణ. ఈ స్కూటర్ మనల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం ఖాయం. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటల ట్యూన్ల తో సరిపోయేలా ఉండే ఈ ‘చల్ చల్ గుర్రం’ సాహిత్యంలో చాల అరుదైన తెలుగు పదాలని సినిమా కథకి సరిపోయేలా ఉపయోగించారు. రామజోగయ్య శాస్త్రి గారి పదాల అల్లిక, అనూప్ భండారి స్వరపరిచిన బాణీ వలన ఈ పాట వీనుల విందుగా ఉంటూ సాహిత్య పరంగా ప్రత్యేకత ని చాటుకుంది.

నృత్య దర్శకులు బోస్కో – సీజర్ పర్యవేక్షణలో కనువిందు చేసేలా రూపొందిన ఈ పాటలో స్థానిక పల్లెజనాలు కూడా పాలుపంచుకున్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించి, అనూప్ భండారి దర్శకత్వంలో, ‘జాలీ హిట్స్’ నిర్మాణంలో తెరకెక్కిన ‘రాజరథం’ ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 23 న విడుదల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.