అగ్గిపెట్టెల్లాంటి పక్కా ఇళ్లకు బదులు డబుల్ బెడ్ రూం నివాస గృహాలను పేదల కోసం నిర్మించి ఇస్తామనేది కేసీఆర్ హామీ. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు సొంత ఇల్లు సమకూరుతుందని తెలంగాణలో లక్షల మంది ఆశించారు. సికింద్రాబాద్ లో గృహసముదాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత ఇంతవరకూ ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూము ఇంటిని అందించలేదు. కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
రాజధానిలో లక్షకు పైగా ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భారీగా ప్రణాళికలు వేసినా, పనులు మొదలైంది మాత్రం అంతంత మాత్రమే. సయ్యద్ సాబ్ కా బడా ప్రాంతంలో 48 ఇళ్ల నిర్మాణం మొదలైంది. బండ్లగూడలో 176, సింగం చెరువు ప్రాంతంలో 176, వైఎన్ నగర్ లో 432 ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు.
ఇటీవల 4,986 ఇళ్లకు టెండర్లు పిలిచారు. చివరకు వర్క్ అలాట్ మెంట్ ఉత్తర్వులు మాత్రం 944 ఇళ్లకే ఇచ్చారు. దీంతో ఆ మేరకే పనులు మొదలయ్యాయి. ఈ లెక్కన లక్షల ఇళ్లను నిర్మించడానికి పదేళ్లకు పైగా పడుతుందని అధికారులు చెప్తున్నారు.
నగరంలో ఇళ్ల నిర్మాణానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. వాటిలో ఒక భూమి సమస్య. నగర శివార్లలో భూమి అందుబాటులో ఉంది. కానీ నగరం మధ్యలో తగినంత ప్రభుత్వ స్థలం లేదు. పైగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు నిర్మాణ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు, ఖజానాకు రాబడి అంచనాలు తల్లకిందులు అవుతున్నాయి. పథకాలకు భారీగా నిధులు కావాలి. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఇళ్ల పథకానికి ఆటంకం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.