యూపీలో బీజేపీ అంత విజయం ఎలా సాధించింది ?. సింపుల్గా చెప్పాలంటే తప్పులన్నీ ఎన్నికలకు ముందు కరెక్ట్ చేసుకున్నారు. తాము మారిపోయామని ప్రజల్ని నమ్మించగలిగారు. అలాగే యోగి అవినీతి చేయని.. చేయనివ్వని వైనం ప్రజల్ని ఆకర్షించింది. బీజేపీ పరిస్థితి క్లిష్టంగా ఉందని అంతర్గత సర్వేల్లో తేలినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏ మాత్రం భేషజాలకు పోలేదు. హఠాత్తుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతటితో వదిలి పెట్టలేదు. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు.
వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ వ్యవహరించిన తీరు యూపీ ఓటర్లను ఆకట్టుకుంది. అది ఫలితాల్లో కనిపించింది. ఇక ఏపీలోనూ ఆ తరహాలోనే రైతు ఉద్యమం జరుగుతోంది. అమరావతి రైతులు ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్నారు. వారి వైపు న్యాయం ఉంది.. ధర్మం ఉంది. చట్టం కూడా వారి వైపే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రమే వారి వైపు లేదు. వారి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎవరికీ సదభిప్రాయం లేదు. మొదట్లో డిల్లీ రైతులపై బీజేపీ నేతలు ఎన్నెన్ని నిందలేశారో… అమరావతి రైతులపై వైసీపీ నేతలు అన్ని నిందలేశారు. అదే స్థాయి నిర్బంధాన్ని కూడా చూశారు. అయితే బీజేపీ రియలైజ్ అయి.. క్షమాపణలు చెప్పి.. విజయాన్ని మళ్లీ దరి చేర్చుకుంది.
అచ్చంగా ఢిల్లీ రైతుల పోరాటం తరహాలోనే ఉన్న అమరావతి రైతుల పోరాటానికి న్యాయపరంగా విజయం లభించింది. కానీ ఇప్పటికి ఏపీ ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించలేకపోయింది. ప్రధాని మోడీ పార్టీ కోసం ఎన్నో మెట్లు దిగి.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పి రైతు చట్టాల్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం న్యాయపరంగా సాధ్యం కాదని తెలిసినా… ఇంకా మూడు రాజధానుల పాటే పాడుతోంది. రైతుల్ని కించ పరుస్తూనే ఉంది. కులాల పేరుతో ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అసహ్య భావం పెంచుకుంటూనే ఉంది.
ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించడం వల్ల వైసీపీకి వ్రతం చెడుతుంది.. ఫలితం దక్కదు. ఆ విషయం వైసీపీలో క్లారిటీ ఉంది. కానీ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి.. రైతులకు క్షమాపణలు చెబితే.. తమ ఈగో ఎక్కడ హర్ట్ అవుతుందో అని సందేహిస్తున్నారు. కానీ మోడీ అలా అనుకోలేదు. అందుకే విజయం సాధించారు. యూపీ విజయం చూసిన తర్వాత వైసీపీ.. గెలుపు కోసం.. మోడీ బాటలో వెళ్తుదో లేదో చూడాలి. లేకపోతే.. మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యం లేదు.