పంచ్ గురూ… మోదీపై కొరటాల

దర్శకుడు కొరటాల శివ టైమింగ్ చూస్తే జనాలకు ముచ్చటేస్తుంది. ఆయన ధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు… తెలుగు ప్రజలందరూ తప్పకుండా మెచ్చుకుని తీరాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దలు, ప్రముఖులు ఎవరూ మాట్లాడని, కనీసం నోరు మెదపని సమయంలో కొరటాల ధైర్యంగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్రం నుంచి స్టేట్మెంట్స్ వస్తున్న సమయంలో డైరెక్టుగా మోదీని ట్యాగ్ చేస్తూ… ట్వీట్ చేశారు. అదీ సినిమాటిక్ స్టయిల్‌లో సెటైర్ వేశారు.

రాజకీయ నేపథ్యంలో మహేష్ బాబు హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. విజన్ ఆఫ్ ది భరత్ పేరుతో మొన్నే టీజర్ విడుదల చేశారు. అందులో ఓ డైలాగ్ వుంది… ”ఒక్కసారి ప్రామిస్‌ చేసి ఆ మాట తప్పితే… ‘యువర్‌ నాట్‌ కాల్ట్‌ ఎ మ్యాన్‌’ (నిన్ను మనిషి అని పిలవరు)” అని! అది గుర్తుకు వచ్చేలా మోదీపై కొరటాల పంచ్ వేశారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోదీ చేసిన ప్రామిస్ గుర్తు చేసి, మనమంతా ఆయన్ను మనిషిని చేద్దాం” అని ట్వీట్ చేశారు కొరటాల. “తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో భాగమని మీరు భావిస్తున్నారా?” అని ప్రశ్నించారు. కొరటాల కామెంట్స్ కి ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.