జనసేన అధినేత పవన్ కల్యాణ్ … సినిమాలకు విరామం ఇచ్చినా ఇవ్వకపోయినా… రాజకీయంగా మాత్రం ఇక ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. జనవరి నుంచి ఆయన రాజకీయ కార్యాచరణ ఖరరాయిందని.. నెలలో కనీసం నాలుగైదు రోజులు జిల్లాల పర్యటనలు చేయబోతున్నారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆర్థిక అవసరాల కోసం .,. సినిమాలు చేయక తప్పడం లేదని చెప్పి పవన్ కల్యాణ్…వరుస షూటింగ్లతో బిజీ అయిపోయారు. అయితే.. అనూహ్యంగా కరోనా అడ్డం రావడంతో ఆ సినిమాలు కూడా రిలీజ్ కాని పరిస్థితి. ఇప్పుడు.. మళ్లీ రాజకీయాలు .. ఎన్నికల వరకూ వస్తున్నాయి. దీంతో ఇక రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
జమిలీ ఎన్నికల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఈ అంశంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ కూడా.. తనకు ముందస్తు జమిలీ ఎన్నికల గురించి సమాచారం ఉందని ప్రకటించారు. చంద్రబాబునాయుడు అయితే.. మరో ఏడాదిన్నరలోనే ముందస్తు జమిలీ ఎన్నికలు వస్తాయని క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పవన్ కల్యాణ్.. చాలా సినిమాలను ఒప్పుకున్నారు. రాజకీయంగా బిజీగా ఉండటానికి ముందు.. చకచకా సినిమాలు పూర్తి చేయాలని గతంలో అనుకున్నారు. కానీ.. కోవిడ్ ఆయన ప్లాన్లు మాత్రం.. తలకిందులు చేసింది. ఇప్పుడు.. షూటింగ్లతో పాటు..రాజకీయాల్ని కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉటుంది.
పవన్ కల్యాణ్ ఇప్పటికే తుపాను బాధిత రైతుల్ని పరామర్శించారు. తర్వాత పార్టీ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నిక అంశంపై దృష్టిపెట్టారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ.. అక్కడినుంచి తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడానికి.. మీడియాకు ఎక్కకుండా ప్రయత్నాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో… ప్రజాసమస్యలపై బీజేపీ తో పాటు.. నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికి బీజేపీ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో జనసేన భాగం కావడం లేదు. ఇక ముందు బీజేపీతో భాగం అయినా అవకపోయినా.. పవన్ మాత్రం పార్టీని బలోపేతం చేయాలనే దిశగా జిల్లాల పర్యటనలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది.