సౌర, పవన్ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ… కమిటీలు, న్యాయవిచారణల పేరుతో.. హడావుడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం.. మరోసారి హెచ్చరికల్లాంటి లేఖ పంపింది. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ సంస్థలను టారిఫ్ తగ్గించాలని కోరిన విషయంపై.. ఏపీ ప్రభుత్వానికి ఈ సారి నేరుగా.. విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయని …కాంట్రాక్టులను గౌరవించడం లేదనే భావన బయటికి వెళ్తే.. పెట్టుబడులు రావని లేఖలో మంత్రి ఆర్కే సింగ్ ఆందోళన వ్యక్తం చేశాయి. టారిఫ్లను కేంద్ర, రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు నిర్దారిస్తాయని.. దానితో ప్రభుత్వానికేమీ సంబంధం లేదని గుర్తు చ ేశారు. పీపీఏలను రద్దు చేయడం చట్ట విరుద్ధమవుతుందని హెచ్చరించారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే రద్దు చేసి ప్రాసిక్యూషన్ చేయొచ్చు కానీ.. ఊరకనే…కుదరదని స్పష్టం చేశారు. లేఖతో పాటు వివిధ రాష్ట్రాల్లో పీపీఏల టారిఫ్ను కూడా పంపిస్తున్నామని.. పోల్చుకుంటే.. ఏపీ కుదుర్చుకున్న పీపీఏలు న్యాయమో కాదో మీకు అర్ధమవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఏపీ చేసుకుంది. సోలార్, పవన విద్యుత్ టారిఫ్లను స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయిస్తారని ఆర్కే సింగ్ లేఖలో ప్రభుత్వానికి గుర్తు చేశారు.
జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామని అదే పనిగా ప్రకటనలు చేయడంతో.. అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శి… ఏపీ సీఎస్కు లేఖ రాశారు. అలా చేయడం మంచి పద్దతి కాదని.. ఆ విషయం సీఎంకు చెప్పాలని.. అవినీతి జరిగే అవకాశం లేదని.. లేఖలో పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. కేబినెట్లో పీపీఏలను సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని ఆమోదం తీసుకున్నామని కూడా ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేశాయి. దానికి తగ్గట్లుగానే కొద్ది రోజుల క్రితం.. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీఎం ప్రత్యేక కార్యదర్శి డి.కృష్ణ, దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ మాజీ సీఎండీ గోపాలరెడ్డి సభ్యులుగా ఏపీ ట్రాన్స్కో జేఎండీ సభ్య కార్యదర్శిగా ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ… పీపీఏలు చేసుకున్న విద్యుత్ సంస్థలతో మాట్లాడి.. ధరలు తగ్గించాలని ఒత్తిడి చేస్తోంది. దీనిపై.. ఆ కంపెనీలు.. కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే.. కేంద్రమంత్రి మరింత ఘాటుగా.. ఏపీ సీఎంకు లేఖ రాసినట్లుగా భావిస్తున్నారు.
నిజానికి పీపీఏలపై సంప్రదిపులకు కమిటీ వేయక ముందే.. జగన్మోహన్ రెడ్డి.. వీటిపై ఓ సారి సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి విద్యుత్ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారిపై న్యాయవిచారణ చేయాలని కూడా ఆదేశించారు. ఏ నివేదికల ప్రకారం చెప్పారో కానీ.. మూడేళ్లలో సౌర, పవన రంగంలో పీపీఏల కారణంగా ప్రభుత్వ పంపిణీ సంస్థలకు రూ.2,636 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం తేల్చారు. సౌర, పవన విద్యుత్తు కొనుగోళ్లలో అధిక చెల్లింపులకు ఒప్పందాలు చేసుకున్నారని .. ఆ మేరకు చెల్లింపులు చేశారని జగన్ చెప్పుకొచ్చారు. అయితే న్యాయవిచారణ గురించి ఆ తర్వాత మాట్లాడలేదు కానీ కమిటీ వేశారు. ఇప్పుడు.. ఆ కమిటీ విద్యుత్ సంస్థలపై ధరల తగ్గింపునకు ఒత్తిడి తెస్తూండటంతో..నేరుగా కేంద్రమే రంగంలోకి దిగింది.