ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందో లేదో అనే సస్పెన్స్ వీడింది. ఇప్పట్లో పెరగదని రూఢి అయింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అధికార పార్టీల అధినేతలూ అయిన చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర రావులకు ఇది ఊహించని షాక్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371కు సవరణ చేయకుండా సీట్ల సంఖ్యను పెంచలేమని కేంద్ర మంత్రి హన్స్ రాజ్ రాజ్యసభలో టీజీ వెంకటేష్ కు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. అంతేకాదు, ఆర్టికల్ 170 ప్రకారం 2026లోగా నియోజకవర్గాల పునర్విభజన కుదరదు.
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెరుగుతాయని వీరిద్దరూ చాలా భరోసాతో ఉన్నారు. అందుకే ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఎమ్మెల్యేలు ఎమ్మల్సీలే కాదు, ఏ పదవీ లేని వారు కూడా చాలా మంది ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల్లో చేరారు. తెలంగాణలో ఫిరాయింపు బహు జోరుగా జరిగాయి. తెలుగు దేశం పార్టీని ఖాళీ చేయాలనే పంతంతో దాదాపు ఎమ్మెల్యేలందంరికీ గులాబీ కండువా కప్పారు. చివరకు ముగ్గురు మాత్రమే టీడీపీలో మిగిలారు. కాంగ్రెస్ నుంచి కూడా వీలైనంత మందిని కారెక్కించారు.
కాస్త ప్రజాబలం ఉందనుకున్న మిగతా నాయకులను కూడా చేర్చుకున్నారు. ఫలితంగా చాలా చోట్ల ఒక అసెంబ్లీ సీటు కోసం చాలా మంది పోటీ పడే పరిస్థితి ఏ ర్పడింది. తెలంగాణలో ఇప్పుడున్న సీట్ల సంఖ్య 119 నుంచి 153కు పెరుగుతుందని తెరాస నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఒకేసారి 34 సీట్లు పెరుగుతాయి కాబట్టి ఎలాగోలా టికెట్లను సర్దుబాటు చేయవచ్చనుకున్నారు.
ఇటీవల జిల్లా సంఖ్యను అమాంతం 10 నుంచి 31కి పెంచారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లోని ప్రాంతాలు రెండు మూడు జిల్లాలకు వెళ్లాయి. అంటే ఆ ఎమ్మెల్యే రెండు మూడు జిల్లాలు తిరగాల్సిన పరిస్థితి. వచ్చే ఎన్నికల ప్రచారంలోనూ ఇది ఇబ్బందిగా మారవచ్చు. పైగా జిల్లా మారింది, నియోజకవర్గం మారలేదు. దీంతో ఎమ్మెల్యే నియోజకవర్గం ఒక జిల్లాలో, సొంత ఊరు మరోజిల్లాలో చేరిన సంఘటనలు ఉన్నాయి. కొందరు మంత్రుల సొంత ఊళ్లు ప్రస్తుతం వాళ్ల నియోజకవర్గాల్లో లేకుండా పోయాయి. మొత్తం మీద సీట్ల సంఖ్య పెరగకపోతే అనేక ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరు చంద్రులకూ ఇది పెద్ద సవాలే.