సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కారణం చెప్పి అరెస్టులు చేయడం.. కేసులు పెట్టడం దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల మరీ ఎక్కువగాఉంది. ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడల్లా.. 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రచారంలోకి వస్తుంది. ఆ తీర్పు ప్రకారం.. సోషల్ మీడియాలో అభ్యంతరక పోస్టులు పెట్టారంటూ.. కేసులు పెట్టే ఐటీ యాక్ట్ 66A కింద కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ సెక్షన్లనే రద్దు చేసింది. ఇలా రద్దు చేసి ఆరేళ్లవుతోంది. కానీ ఆ సెక్షన్ల కింద కేసులు పెట్టడం మాత్రం ఆగడం లేదు. ఆరేళ్ల కాలంలో వెయ్యి కేసులకుపైగా నమోదయ్యాయి.
దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ విషయం తెలుసుకుని సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన చట్టం కింద.. వేల కేసులు నమోదవుతూంటే… ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని… సుప్రీంకోర్టు ధర్మాసనానికి అనుమానం వచ్చింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నిజానికి చట్టం రద్దయినప్పటికీ.. చాలా ప్రభుత్వాలు రాజకీయంగా వ్యతిేక పోస్టులు పెట్టారన్న కారణంగా ఆ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు రావడంతో 2019లో కూడా ఓ సారి సుప్రీంకోర్టు ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని ఆదేశించింది.
కానీ ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. నిస్సంకోచంగా కేసులు పెడుతూనే ఉన్నారు. అరెస్టులు చేస్తూనే ఉన్నారు.భావప్రకటనా స్వేచ్చను ప్రభుత్వాలు అడ్డుకోవడానికి అదో సాధనంగా మారింది. తమ పార్టీ వారు ఇతరులను ఎన్నెన్ని మాటలైనా అనొచ్చు కానీ.. తమను అంటే మాత్రం కేసులు పెట్టమని పోలీసుల్ని పురమాయిస్తున్నారు. సుప్రీంకోర్టు హెచ్చరికలతో అయినా దేశంలో మార్పు వస్తుందో లేదో చూడాలి..!