కాపుల బుజ్జగింపు వ్యూహం వారిలో సానుకూలత పెంచకపోగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అసంతృప్తికి దారి తీస్తున్నది. గత ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించడానికి ఒక ప్రధాన కారణం మొదటిసారి కాపుల ఓట్లు రావడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అందరికీ బాగా తెలుసు. అందుకోసం తామిచ్చిన హామీని అమలు చేయడంలో చాలా సమస్యలున్నాయనీ తెలుసు. వీలైనంత వ్యవధి తీసుకుని చివరలో ఏదైనా కమిటీనో మరొకటో ప్రకటిద్దామని భావించారు. కాని కాపునాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దాన్ని ప్రధానచర్చనీయం చేసేసరికి ప్రభుత్వం ఇబ్బందిలో పడింది. ఆయన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించినా మొదట ప్రభావం తక్కువగా అంచనా వేసింది. అప్పుడే అనూహ్యంగా రైలుధగ్ధం ఘటనతో ముఖ్యమంత్రి వెంటనే రాజకీయంగా వైసీపీ మీద విమర్శలు చేసి వివాదం మరింత పెంచారు. తర్వాత మళ్లీ మంత్రులను పంపి సర్దుబాటు చేసినా ఆ గడువు కూడా అయిపోతున్నది. మంజునాథ కమిషన్ విచారణపైనా అనేక సందేహాలు వుండటమే గాక పరిమితులు కూడా వున్నాయి. ఒక నిస్పాక్షిక విచారణ జరపాల్సిన న్యాయమూర్తికి ఒక కులం వారెలా సన్మానాలు సత్కారాలు చేస్తారనే విమర్శలు తెలుగుదేశం నుంచే వస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రత్యేక హౌదా సమస్య రావడం, వైసీపీ మాజీ ఎంఎల్ఎ భూమన కరుణాకరరెడ్డిని పిలిచి విచారించడం ఉద్రిక్తత ఇంకా పెంచింది. రెండు చోట్ల కమిషన్ విచారణ దగ్గర ఒకరి సత్కారాలు మరొకరి నిరసనలు రసాభాసకు దారితీశాయి. బిసిలు దీనికి అభ్యంతరం తెల్పవచ్చని చంద్రబాబు మొదట్లోనే సూచనగా అన్నారు. అది ఇప్పుడు జరుగుతున్నది.బిసిల రిజర్వేషన్లు తగ్గించకుండా కాపులకు ఎలా కల్పిస్తారనే ప్రశ్న గట్టిగా ే వినిపిస్తున్నది. కమిషన్ ఎంత వ్యవధి తీసుకుంటుందనేది ఒకటైతే ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలి. అయినా గుజరాత్లో పటేళ్లు హర్యానాలో జాట్ల రిజర్వేషన్లను కోర్టులు నిలుపుచేసినట్టు కాపుల విషయంలోనూ జరగొచ్చనే అంచనాలున్నాయి. ఇదంతా లేకుండా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయించాలనేది కాపులూ, వారికి సంబంధించిన వైసీపీ నేతలు చేస్తున్న డిమాండు.అది అంత సులభంగా జరిగేది కాదు.
ముద్రగడ పద్మనాభం తన పట్ల పోలీసుల ప్రవర్తన గురించి ఇతర కాపు ప్రముఖుల దగ్గర బాధపడటం, అందరికీ చెప్పిన తర్వాతే ఈ సారి ఆందోళన చేపడతానన్న హామీ ఆ నాయకులు ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు.వైసీపీ పాత్రను పదేపదే ప్రస్తావించం, వారిపై దర్యాప్తుల ద్వారా ప్రభుత్వం ఆ నాయకులు మరింత సూటిగా ముద్రగడకు మద్దతు నిచ్చే పరిస్థితి తెచ్చిందని వారంటున్నారు.
చంద్రబాబు ఆ వర్గం నాయకులకు శ్రుతి మించిన ప్రాధాన్యత నిస్తున్నారని ఇతరులు కినుక వహిస్తున్నారు. దీనివల్ల సంప్రదాయ మద్దతుదారులు దూరం కావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఎంత చేసినా చివరకు వారు మనతో వస్తారనే హామీ లేదని కూడా ఇలాటి వారు విశ్లేషిస్తున్నారు. ఈ సమస్య మరీ ముఖ్యంగా విజయవాడలో స్పష్టంగా కనిపిస్తుంది. ముద్రగడను ఒప్పించడంలో ముందున్న అచ్చెం నాయుడుపై ముఖ్యమంత్రి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఈ విమర్శలను తగ్గించడానికేనని కొందరు చెబుతున్నారు. తూర్పు గోదావరిలో ముద్రగడ ప్రభావాన్ని దీటుగా తట్టుకోగల మంత్రి లేదా నాయకుడు ఆ తరగతుల నుంచి రావడం లేదని కూడా పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కొంతవరకూ ఈ దిశలో ప్రభావం చూపినా ఆయన కూడా విమర్శలే చేస్తున్నారు గనక గతంలో వలె మనకు మేలు చేసేది వుండదని వారు అంటున్నారు.