యూనిఫామ్ సివిల్ కోడ్.. దీనిపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ చర్చను తీసుకొచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. తాము అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని భాజపా వాగ్దానం చేసింది. ఆ మాట ప్రకారమే ఇప్పుడు అమలుకు సిద్ధమౌతోంది. ఇప్పుడే ఎందుకు దీని గురించి కేంద్రం మాట్లాడుతోందీ అంటే… ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి కదా అని కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా, మనదేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ కోడ్ అమలు సాధ్యమా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న! ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్ర లా కమిషన్ ప్రజాభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలూ ఇతర సంస్థలూ స్పందించాయి. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వ్యక్తం చేసింది. ముస్లిం లా బోర్డు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మోడీ సర్కారుపై విమర్శలు కూడా చేసింది. వాటిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించడం, తిప్పికొట్టడం కూడా జరిగింది. ఇంకోపక్క, ముస్లింలలో ఉండే ట్రిపుల్ తలాక్ పద్ధతిపై సుప్రీం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం కూడా తలాక్ పద్ధతిని వ్యతిరేకిస్తోంది. దీంతో యూనిఫామ్ సివిల్ కోడ్, తలాక్ పద్ధతుల విషయమై మోడీ సర్కారు తర్జనభర్జనలో పడింది.
నిజానికి, యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా దేశాల్లో అమల్లో ఉంది. మన రాజ్యాంగంలో కూడా ఇది ఉంది. అయితే, అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ఈ కోడ్ ప్రకారం మతాలతో ప్రమేయం లేకుండా దేశంలోని పౌరులందరూ ఒకే నిర్దిష్ట విధానాన్ని, ఒకే నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనదేశంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే… దీని అమలుపై ముస్లింలకు సహజంగానే కొన్ని భయాలు ఉండొచ్చు! మనది లౌకిక రాజ్యం అని చెప్పుకుంటాం. అంటే, మత ప్రమేయం లేని రాజ్యం అని అర్థం. కానీ, మన పాలకులు ఎక్కువగా ఒకే మత విధానాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకుంటే, అత్యధిక ప్రజలు హిందువు కాబట్టి అని అంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బహరంగ సభల్లో జై శ్రీరామ్ అని నినదిస్తే లౌకిక వాదం ఎలా అవుతుంది..? ఏదైనా కార్యాలయం ప్రారంభించాలన్నా హిందూ మత విధానాల ప్రకారం పూజలు చేస్తారు. ప్రజలందరి ప్రయోజనాల కోసం కడుతున్న రాజధాని శంకకుస్థాపనకు కూడా ప్రధాని పవిత్ర జలాలు తెస్తారు. ఛండీయాగాలు ప్రభుత్వ ఖర్చుతో చేస్తారు. సొంత మొక్కుల్ని రాష్ట్ర ప్రజల ఖాతాలో వేసి కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నారు. కిలోల కొద్దీ బంగారు కిరీటీలను ప్రజల సొమ్ముతో కొనుగోలు చేస్తారు. పుష్కరాల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తారు. ఇవి చెయ్యడం తప్పు అని కాదు. కానీ, ఇలా చేయడం లౌకిక వాద స్ఫూర్తికి సరిపోతోందా అనే విశ్లేషణ పాలకులకు ఉండాలి కదా. ఉత్సవాలు, పుష్కరాల అనేవి ప్రజలకు సంబంధించిన వ్యవహారాలుగా చూడాలి. వారికి సౌకర్యాలు కల్పించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత. అంతేగానీ, బాధ్యతను విధానంగా మార్చుకోవడం తగ్గాలి.
ఒకపక్క ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని అనుకుంటున్నప్పుడు రాజ్యాన్నీ, మతాన్ని ఇలా కలగపుతున్న నేతల ధోరణిని ఏమనుకోవాలి..? మతాన్ని రాజకీయ ప్రయోజనాంశంగా మార్చేసిన పార్టీలను మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యూనిఫామ్ సివిల్ కోడ్ మనదేశంలో కష్టమే అనే అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి, దీని అమలు అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు సహజంగానే అభ్యంతరాలు వినిపిస్తాయి. అయితే, చిత్తశుద్ధితో దీన్ని అమల్లోకి తెస్తామని అంటే ఎవరు వద్దంటారు! ఈ అంశాన్ని ఒక రాజకీయ ప్రయోజనకారిగా చూస్తేనే సమస్య వస్తుంది. త్వరలోనే యూపీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి, ఈ అంశాన్ని ఇప్పుడు భాజపా తెరమీదికి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, దేశప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే మంచిది. మొత్తమ్మీద భాజపా ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయంగా మార్చేసింది. ఈ చర్చ ఎటువైపు వెళ్తుందో… కాలం నిర్ణయించాల్సిందే.