మహాన్యూస్ పై దాడి జరిగిన తర్వాత కేటీఆర్ ఓ ట్వీట్ పెట్టారు. భౌతిక దాడుల్ని ఖండిస్తామన్నారు కానీ.. కింద ఓ హిందీ డైలాగ్ చెప్పారు. “ఈట్ క జవాబ్ పత్తర్ సే దేంగే” అని ఫైర్ చూపించారు. అంటే ప్రతీ దానికి సమాధానం ఇస్తామని అర్థం. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే చెబుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా లో సీఎంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ..కించ పరుస్తున్నారు.. అలాంటి వారిని వదిలేద్దామా అని.. అదే డైలాగ్ చెబుతున్నారు. వారిపై దాడులు చేయని కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించాలని.. దాడులు చేయాలని రెచ్చగొడుతున్నారు. దీంతో పరస్పర దాడుల హెచ్చరికలు పెరిగిపోతున్నాయి.
బీఆర్ఎస్ దాడులు హెచ్చరికలు – కాంగ్రెస్ ప్రతి దాడుల హెచ్చరికలు
మహా న్యూస్ పై దాడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసగా హెచ్చరికల ప్రకటనలు చేస్తున్నారు. దాడులు చేస్తామంటున్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాటలు మరీ శృతిమించి పోయాయి. ఆయనేదో తెలంగాణ సిద్ధాంతకర్త అన్నట్లుగా.. హైదరాబాద్లో ఎవరైనా ఉండాలంటే.. ఆయన దగ్గర పడి ఉండాలని లేకపోతే దాడులు తప్పవన్నట్లుగా మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు కొన్ని మీడియా చానళ్ల అడ్రస్సులు పెట్టుకుని దాడి చేయడం ఖాయమని ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా రెడీ అయ్యారు. ఈట్ క జవాబ్ పత్తర్ సే దేంగే కాచుకోండి అని జవాబిస్తున్నారు.
దాడులకు గురయ్యేది సామాన్య కార్యకర్తలు
సోషల్ మీడియా కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. దానికి జగదీష్ రెడ్డి లాంటి వాళ్లు ఆజ్యం పోస్తున్నారు. మీడియాపై దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో మీడియాకు తెలుసు. కానీ ఇలా హెచ్చరికలు చేయడం వల్ల మధ్యలో కార్యకర్తలు బలైపోతారు. కేసుల సంగతి తర్వాత ముందు కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వ పెద్దల్ని మెప్పించాలని వారు అరాచకం చేయడానికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువగా దెబ్బతింటారు.
రాజకీయ గొడవలతో శాంతిభద్రతల సమస్యలు
రాజకీయ ప్రయోజనాల కోసం.. శాంతిభద్రతల సమస్యలు సృష్టించుకుంటే తెలంగాణకే నష్టం జరుగుతుంది. దాడులు చేయడం.. చేస్తామని బెదిరించడం.. ఏ రాజకీయ పార్టీకీ ఉపయోగపడని విధానం. రాష్ట్రానికీ సమస్యలు తెచ్చి పెడతాయి. చట్టంపై నమ్మకం ఉంచక.. స్వయం న్యాయం చేసుకుంటామని బయలుదేరితే అందరూ అదే చేస్తారు. అప్పుడు గందరగోళం అవుతుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య రాజకీయాలు చేయాలి.