భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. లెజెండరీ గాయని, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఆశాభోంస్లే ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, శనివారం సాయంత్రం తీవ్రమైన ఛాతి ఇన్ఫెక్షన్, నీరసంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆమె వయసు 92 ఏళ్లు. గుండెపోటు రావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.
తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ జీవితంలో ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశాభోంస్లే ప్రస్థానం అద్వితీయం. 1933లో జన్మించిన ఆమె, తొమ్మిదేళ్ల వయసులోనే గాయనిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. శాస్త్రీయ సంగీతం నుంచి పాప్, గజల్స్, జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. 20కి పైగా భాషల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. తన సోదరి లతా మంగేష్కర్ మాదిరిగానే ఆమె భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక మూలస్తంభంగా నిలిచారు.
ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభోంస్లే గారి మరణం తీరని లోటు. ఆమె మధుర గాత్రం తరతరాల వరకు సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచి ఉంటుంది అని నివాళులర్పించారు. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఒక శకం ముగిసిందని, భారతీయ సంగీతం తన స్వరాన్ని కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశాభోంస్లే భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని ఆమె నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే వెల్లడించారు. ఆమె మరణవార్త తెలియడంతో బ్రీచ్ కాండీ ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు చేరుకుంటున్నారు.
