కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముద్రగడ ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం కోసం ఏపీ సర్కారు కూడా తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది! జనవరి నెలలో సత్యాగ్రహ పాదయాత్రను నిర్వహించాలని ముద్రగడ భావిస్తే… పోలీసులు ఆయన్ని గృహనిర్బంధం చేశారు. అదే సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమం… మరోసారి పవన్ కల్యాణ్ యాక్టివ్ పార్ట్… ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారమే కాపుల ఉద్యమంపై ఫోకస్ తగ్గించడానికే జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి! సరే, గతం గతః. తాజాగా ఈ నెల 26న కర్నూలులో మరోసారి ఉద్యమించేందుకు ముద్రగడ సిద్ధమౌతున్నారు. కనీసం ఈ దీక్షా కార్యక్రమం అయినా సక్రమంగా జరుగుతుందా అంటే… ఏపీ సర్కారు ధోరణి చూస్తుంటే అనుమానంగానే అనిపిస్తోంది!
ముద్రగడ దీక్షకు అనుమతులు లేవంటూ మళ్లీ రొటీన్ పాత వాదననే తాజాగా వినిపించారు ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. దీక్షకు పోలీసు శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఇంతవరకూ ముద్రగడ అలా కోరిన దాఖలాలు లేవని రాజప్ప అన్నారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉండాలనీ, అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమౌతుందని రాజప్ప అభిప్రాయపడ్డారు. ముద్రగడ దీక్ష కావొచ్చు, మరే ఇతర నిరసన కార్యక్రమాలైనా ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేసేవిగా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ముద్రగడ తాజా దీక్షకు అనుమతి తీసుకోలేదనీ, దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని ఆయన అన్నారు.
సో… తెలుగుదేశం ఉద్దేశం ఏంటో మరోసారి స్పష్టమౌతోంది. ముద్రగడను కూడా అభివృద్ధి నిరోధకుడిగా చిత్రించే ప్రయత్నం ఇక్కడి నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇప్పటికే ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత జగన్ ఉద్యమిస్తుంటే… అభివృద్ధి నిరోధకులు అని ముద్రవేసి విమర్శిస్తున్నారు. ఇప్పుడు, ముద్రగడ కార్యక్రమాలు కూడా ఏపీ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయనే అభిప్రాయంతోనే రాజప్ప ఈ వ్యాఖ్యలు చేసినట్టు చూడాలి.
ఇక్కడ రాజప్పగానీ, తెలుగుదేశం సర్కారుగానీ వదిలేస్తున్న అసలు విషయం ఏంటంటే… కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితిని ఎవరు కల్పించారు అనేది ఆలోచించాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చింది వారే కదా. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో అది సర్వసాధారణం. తమ అభిప్రాయాన్ని నిరసన రూపంలో వ్యక్తీకరిస్తారు. అది అభివృద్ధి నిరోధక చర్య ఎలా అవుతుందో మరి!