ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయనగరంలో ర్యాలీ చేసిన ఆయన ఎండలో వాహనంపై నిలబడి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో ఒక్క సారిగా ఆయన అలా నిలబడిపోయారు. అలా కళ్లు ఆర్పకుండాచూస్తూ.. కిందపడిపోయారు. హుటాహుటిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బొత్స ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఆస్పత్రి వర్గాల నుంచి తెలియాల్సిన ఉంది.
బొత్స సత్యనారాయణకు తీవ్రమైన హృద్రోగ సమస్యలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పటి నుంచి బయట తీవ్రమైన ఒత్తిడి ఉండే కార్యక్రమాలు, రాజకీయ వేదికలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన తన భార్యకు విశాఖ టిక్కెట్ ఇప్పించుకున్నారు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల సమయంలో ఒత్తిడికి గురయ్యారు.
ఇటీవల ఆయన పూర్తిగా ప్రెస్ మీట్లకే పరిమితయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిపోయిన సందర్భంగా వెన్నుపోటు దినాన్ని గట్టిగా జరపాలని పార్టీ కార్యాలయం ఆదేశించింది. ముఖ్య నేతలంతా పాల్గొంటేనే వారు పార్టీలో ఉన్నట్లుగా భావిస్తామని హెచ్చరికలు పంపారు. దాంతో బొత్స సత్యనారాయణ ర్యాలీలో పాల్గొనాల్సి వచ్చింది. వడ దెబ్బ తగిలి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.