అభిషేక్ మహంతి అనే ఐపీఎస్ అధికారికి తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు సర్వీసులోకి తీసుకుంది. ఆయన ఏడు నెలలుగా జీతం లేకుండా అటు ఏపీకి కాకుండా.. ఇటు తెలంగాణకు కాకుండా ఉండిపోయారు. ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సర్వీసులోకి తీసుకోలేదో తెలియదు కానీ… ఏపీ ప్రభుత్వం నుంచి ఆయన ఎందుకు వెనక్కి వచ్చేశారో మాత్రం కథలు కథలుగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన సందర్భంగా సివిల్ సర్వీస్ అధికారులను విభజించినప్పుడు అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. ఆయన చంద్రబాబు హయాంలో సిన్సియర్ ఆఫీసర్గా చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఆయనను కడప ఎస్పీగా నియమించారు.
ఆయన ఎస్పీగా ఉన్నప్పుడే్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆయనను బదిలీ చేసింది. వైసీపీ సర్కార్ ఏర్పాటయిన తర్వాత ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. సిట్లో కూడా పని చేయలేదు. చివరికి ఆయనను సిట్ నుంచి కూడా బదిలీ చేశారు. అభిషేక్ మహంతి తండ్రి ఏకే మహంతి మాజీ డీజీపీ. ఆయన తన ఇన్ ఫ్లూయన్స్తో అభిషేక్ మహంతిని వివేకా కేసులో లేకుండా చేయగలిగారని.. ఆ తర్వతా తన కుమారుడు ఏపీలో పని చేయడం సేఫ్ కాదని.. తెలంగాణ క్యాడర్కు బదిలీ చేయించుకునేందుకు క్యాట్ ను ఆశ్రయించారని తెలుస్తోంది.
అయితే క్యాట్ ఆదేశాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేర్చుకోలేదు. అభిషేక్ మహంతి అదే పనిగా న్యాయపోరాటం చేసి.. చేసి.. చివరికి పోస్టింగ్ తెప్పించుకోగలిగారు. ఏడు నెలలుగా ఆయన జీతం లేకుండా ఖాళీగా ఉన్నారు. ఇప్పటికి పోస్టింగ్ దక్కించుకున్నారు. క్యాట్ ఆదేశాల ప్రకారమే ఆయనకు ఈ పోస్టింగ్ దక్కింది. నిజానికి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కూడా ఏపీ క్యాడరే. కానీ ఆయన కూడా క్యాట్కు వెళ్లి .. తెలంగాణలో కొనసాగేలా ఆదేశాలు తెచ్చుకున్నారు.