కల్వకుంట్ల కవిత పూర్తిగా కేసీఆర్ ఫోటోతోనే సొంత పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది బీఆర్ఎస్ విభాగం కాదని.. ప్రత్యేకం అని తన ప్రెస్ మీట్ లో నేరుగానే చెప్పారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఓ కన్ను అయితే జాగృతి మరో కన్ను అని స్పష్టం చేశారు. జాగృతి అనుబంధ విభాగం అనుకునేవారికి కవిత క్లారిటీ ఇచ్చారు.
ప్రొఫెసర్ జయశంకర్ చెబితేనే జాగృతిని ప్రారంభించానని కూడా చెప్పారు. కేసీఆర్ తనను .. తన రాజకీయ ప్రయాణాన్ని వ్యతిరేకించరని కవిత గట్టిగా నమ్ముతున్నారు. అందుకే జాగృతి కార్యాలయంలో ఆయన ఫోటోనే ముందు పెట్టారు. కేసీఆర్ తో దిగిన ఫోటోను ఆకర్షణీయంగా పెట్టారు. కేసీఆర్ పై ఈగ వాలినా సహించేది లేదని ప్రకటించారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనలు కూడా ప్రకటించారు.
కేసీఆర్ తనకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. జాగృతి పేరుతో ఇక నుంచి కవిత రాజకీయాలు చేయబోతున్నారు. దానికి కొత్త పార్టీ అనిపేరు పెట్టుకున్నా.. తర్వాత ప్రకటించినా.. ఇక నుంచి కవిత రాజకీయాలు మాత్రం బీఆర్ఎస్ నీడలో కాకుండా.. జాగృతి పేరు మీదనే సాగనున్నాయి.