కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ పీసీ ఘోష్ ను తప్పించి, కేటీఆర్ ఎప్పుడు నియామకం అయ్యారు? అని ఆశ్చర్యపోకండి..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ , హరీష్ రావులకు ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వింటే.. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ కేటీఆరేమోననే అనుమానం కలిగేలా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
సోమవారం ఓ ఛానెల్ తో కేటీఆర్ మాట్లాడారు. మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని , కాళేశ్వరం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయనకు ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు.
నేడు కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరై పూర్తి విషయాలను వెల్లడించారు.. కేసీఆర్ విచారణలో కొత్తగా చెప్పాల్సినది ఏమి లేదని చెప్పేశారు. హరీష్ రావు అన్ని వివరాలను వెల్లడించారా? ఆయన చెప్పిన వివరాలన్నీ వాస్తవమైనవేనా? హరీష్ విచారణతో ఇక, కేసీఆర్ ను విచారించడం అక్కరలేదా? అనేది కమిషన్ నిర్ణయిస్తుంది.
అయినా , కేటీఆర్ మాత్రం ఇక కేసీఆర్ విచారణ అక్కర్లేదని మాట్లాడటం చూస్తుంటే.. కమిషన్ చైర్మన్ గా కేటీఆర్ వ్యవహరిస్తున్నట్టుగా ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు..విచారణ నేపథ్యంలో కేటీఆర్ కు లోలోపల భయం కూడా పట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు.