నారా లోకేష్కు మంత్రి పదవి ఎప్పుడొస్తుందా అంటూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు దేశం నేతలు! ఈసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటే, ముందుగా చినబాబుకు ఆమాత్య పదవి ఇస్తారని విశ్వసిస్తున్నారు. ఇంతకీ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడనేది మాత్రం ఇంకా స్పష్టతలేదు. దసరా అయిన వెంటనే విస్తరణ ఉంటుందని గతంలో సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. దీపావళి దాటిపోతున్నా దాని గురించి మారుమాట్లాడటం లేదు. సంక్రాంతి సమీపిస్తున్నా అలాంటి సంకేతాలే లేకుండా పోయాయి! అయితే, త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకేష్ ను ఎమ్మెల్సీ చేసిన వెంటనే మంత్రిపదవి కట్టబెడతారని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవుల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.
తనకు పదవీ వ్యామోహం లేదనీ, వెంటనే మంత్రి అయిపోవాలన్న ఆత్రం లేదని గతంలో నారా లోకేష్ చెప్పారు. కానీ, ఇప్పుడు మంత్రి పదవి గురించి మరోలా మాట్లాడారు! ఒక ఇంటర్వ్యూలో మంత్రి పదవి గురించి మాట్లాడుతూ… మంత్రి పదవి తీసుకోకపోతే తనని అసమర్థుడు అని అనుకుంటారనీ, అందుకే పార్టీ ఇచ్చిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తానని లోకేష్ చెప్పారు. ఈ అభిప్రాయం తనదిగా చెప్పలేదండోయ్! పార్టీ నేతలదు అని చెప్పడం విశేషం. మంత్రిపదవి విషయంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని లోకేష్ చెప్పారు. ఏ శాఖ తనకు ఇచ్చినా సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తానని తన మనసులో మాటను బయటపెట్టారు.
ఇక, ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతూ… ప్రస్తుతం తనకు ఎలాంటి తొందరా లేదన్నారు. తాను 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాననీ, ఈలోగా ఎంతో అనుభవం వస్తుందని లోకేష్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై లోకేష్కు క్లారిటీ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడే మరోసారి రంగంలోకి దిగుతారన్నది సుస్పష్టం! కానీ, రాజకీయాల్లో మరో పాతికేళ్లు ఉంటాననీ, ఈలోగా అనుభవం వస్తుందని లోకేష్ అనడమే కాస్త గందరదోళంగా ఉంది! అంటే, పాతికేళ్లు అనుభవం వచ్చిన తరువాత సీఎం సీటు గురించి ఆలోచిస్తానని చెప్పినట్టా..?