వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిపోతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట ఏది ఇల్లో, ఏది చెరువో అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్లోని నిజాం పేట, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేదు. నిలబడడానికి చోటు లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో వాళ్లంతా ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) బృందం వరద ప్రాంతాల్ని సందర్శించింది. రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజా, కాదంబరి కిరణ్ ఇలా దాదాపు 20 మంది సభ్యులు ప్రజల్ని పరామర్శించడానికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ.. బిస్కెట్లు, నీళ్ల సీసాలు, పాల పాకెట్లు తీసుకెళ్లి తమ వంతు సహాయం చేశారు.
అంతా బాగానే ఉంది. కానీ వీళ్లు తీసుకెళ్లింది తక్కువ. ఇచ్చిన బిల్డప్ మాత్రం ఎక్కువ… అని స్థానికులు జోకులు వేసుకోవడం వినిపించింది. ఓ చిన్న ఆటోలో పాలు, నీళ్లు, బిస్కెట్లు వేసుకొని, వాటిని పంచి పెట్టడానికి 20 మంది బయల్దేరి, మధ్యలో ఫొటోలు, మీడియాకు ఇంటర్వ్యూలూ, సానుభూతి వాక్యాలతో.. కళ్లు తెరిపించేశారు. ‘మా’ స్థోమత ఇంతేనా? పాలూ, బిస్కెట్ల కోసం అంత దూరం, ఇంత సైన్యం వెంట పెట్టుకొని ఎందుకు వెళ్లినట్టు..? ‘మా’లో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు తీసుకొంటున్న హీరోలున్నారు. హాస్యనటులు, విలన్లు ఉన్నారు. వాళ్లందరి ఉడతా భక్తి సాయం ఇంతేనా? ఈ విషయంలో తమిళ తంబీల్ని చూసి నేర్చుకోవాలి. చెన్నై మొత్తం వరదల్లో మునిగినప్పుడు తమిళ హీరోలు చలించిపోయారు. స్వచ్చందంగా వచ్చి సేవ చేశారు. అన్నం పెట్టారు. వసతి కల్పించారు. లక్షలకు లక్షలు విరాళాలు కురిపించారు. చెన్నై మళ్లీ మామూలు అయ్యేంత వరకూ.. వాళ్లూ నిద్ర పోలేదు. మనోళ్ల సేవంతా ట్విట్టర్లలో పోస్టింగులు పెట్టడానికీ, పేస్ బుక్కుల్లో కన్నీళ్లు కార్చడానికే పరిమితమైపోయింది. మన హీరోల్లో ఇప్పటి వరకూ వరదల గురించి మాట్లాడిన వాళ్లే లేరు. మన హీరోలు కేవలం రీలు లైఫులోనే హీరోలు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి?