✍ నాగం జనార్థన్ రెడ్డి. ఒకప్పుడు టీడీపీలో కీలక నాయకుడు. చంద్రబాబు తర్వాత టాప్-3 లో ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడికి పార్టీ మారిన తర్వాత ఏదీ కలిసి రావడం లేదు. టీడీపీ నుంచి బీజేపీలో చేరారాయన. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా బీజేపీలో సముచిత ప్రాధాన్యం లభిస్తుందని ఆశించారు. చివరికి నిరాశే మిగిలింది. బీజేపీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించి సరిపెట్టింది. ఏదైనా మంచి పోస్టు వస్తుందని అనుకుంటే.. చివరకు ఏదీ దక్కలేదు.
👉 నిజానికి అప్పట్లో టీడీపీలో ఉన్నప్పుడు నాగం తరచూ మీడియాతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు బీజేపీలో అలా కాదు. పార్టీ అధిష్టానం ఏది చెబితే అదే మాట్లాడాలి. వారు చెబితేనే మీడియా సమావేశం పెట్టాలి. దీంతో నాగం … ఇప్పుడు మీడియాకు కూడా దూరమైపోయారు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అగ్రనేతగా ఉన్న ఆయన… ఇప్పుడు బీజేపీలో ఒక జిల్లాకే పరిమితమైపోయారు.
👉 నాగం బీజేపీలో ఇమడలేకపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలకు.. ఆయనకు పడడం లేదని టాక్. ఆ మధ్య ఆయన తెలంగాణ బచావో అంటూ వేదికను కూడా మొదలుపెట్టారు. చివరకు దాన్ని వదిలేశారు. ఇప్పుడు ఆయన ఎటూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు. టీడీపీలోకి వెళ్దామంటే.. జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయాలి. ఒకవేళ వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.
👉 బీజేపీలో ఉందామంటే పొమ్మనక పొగబెట్టుతున్నారని భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ లోకి వెళ్లలేరు. ఇక మిగిలింది టీఆర్ఎస్ మాత్రమే. ఆ పార్టీ నుంచి ఎన్నికల ముందే ఆఫర్ వచ్చింది. వెళ్లుంటే..ఏకంగా మంత్రిపదవే దక్కిది. ఇప్పుడు కారెక్కినా అంతగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. దీంతో కొన్నాళ్ల పాటు లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేయాలని ఆయన భావిస్తున్నారట. 2019 ఎన్నికల ముందు తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారట. మొత్తానికి ఇప్పుడు నాగం రెస్ట్ మూడ్ లో ఉన్నారన్న మాట!!!