తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదో సారి బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి ఈ సీటును ఆయన కుమారుడికి అప్పగించి.. తాను మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ.. హైకమాండ్.. కోమటిరెడ్డి, ఉత్తమ్ ల విషయంలో సానుకూలంగా వ్యవహరించి తన.. విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించింది. దాంతో ఆయన నాగార్జునసాగర్ నుంచే పోటీలో నిలబడక తప్పలేదు. ఇంత కాలం.. తన అధిపత్యాన్ని నిరూపించుకున్న ఆయన ఇప్పుడు మాత్రం… తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది. దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉండటంతో సహజమైన వ్యతిరేకత బాగానే కనిపిస్తోంది.
అందుకే జానారెడ్డి ఈ సారి.. గెలిస్తే తనకు ముఖ్య పదవి వస్తుందని … ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన్ను ఓడించి తీరాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మూడు దశాబ్దాలుగా జానారెడ్డికి ఈ నియోజకవర్గం పెట్టని కోట. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాలో జానాకు పరిచయస్తులు ఉన్నారు. 1994లో మినహా ఏడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. 30 ఏళ్లుగా జానారెడ్డి వెన్నంటి ఉండి.. గెలుపు వ్యూహాల్ని అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. దాంతో జానారెడ్డి.. ఇప్పుడు.. స్వయంగా ప్రచార బాధ్యతల్ని చూసుకోవాల్సి వస్తుంది. అక్కడక్కడ నిరసనలు ఎదురు కావడం.. అవి సోషల్ మీడియాలో హైలెట్ కావడంతో.. జానారెడ్డికి నెగెటివ్ ప్రచారం వస్తోంది.
సీఎల్పీ నేతగా జానారెడ్డి పనితీరు కూడా వివాదాస్పదమయింది. ఆయన టీఆర్ఎస్ తో గట్టిగా పోరాడలేదన్న భావన ప్రజల్లో ఉంది. ఈ కారణం కూడా ఆయనకు మైనస్ అవుతోంది. కమ్యూనిస్టు పార్టీ నేపధ్యం ఉన్న నోముల నర్సింహయ్య.. నాగార్జునసాగర్ కు స్థానికేతరుడు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కేసీఆర్ అక్కడి నుంచే బరిలోకి దిగారు. తన అభ్యర్థిత్వం ఖరారైన సెప్టెంబరు 6 నుంచే ఆయన ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 1999, 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున నర్సింహయ్య గెలుపొందారు. 30 ఏళ్లుగా జానారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా… అభివృద్ధి జరగలేదనీ.. ఈ సారి తనకు చాన్సివ్వాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. నోముల నర్సింహయ్య.. యాదవ సామాజికవర్గానికి చెందినవారు. నియోజకవర్గంలోని ఓటర్లలో సగం మంది బీసేలే. మరో 40 వేలు గిరిజన ఓట్లు ఉంటాయి. వీరిపై.. టీఆర్ఎస్ గురి పెట్టింది. అందుకే జానారెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. బీజేపీ, బీఎస్పీ లాంటిపార్టీలు బరిలో ఉన్నా.. అవి రేసులో లేనట్లే..!