తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ ను తొలగించాలని లేకపోతే కనీసం ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ నైనా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను సర్దుబాటు చేసేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ తో భేటీ సమయంలో ఇంచార్జ్ ఠాగూర్ ను తొలగిస్తారని సీనియర్ల క్యాంప్ ప్రచారం చేసింది. కానీ దిగ్విజయ్ హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు అంతా సాల్వ్ అయిందని… ఎవరైనా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తే చర్యలు ఉంటాయని చెప్పి వెళ్లారు.అంటే.. రేవంత్ ను కానీ.. ఠాగూర్ ను కానీ మార్చే ఆలోచనే లేదని స్పష్టమవుతోంది.
హైకమాండ్ తమను ఏదో విధంగా సంతృప్తి పరుస్తుందని.. తమకు కొంత బలం చేకూరురుస్తుందని సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు పట్టించుకోలేదని అనుకుంటారేమోనని హైకమాండ్ దిగ్విజయ్ ను పంపింది. ఆయన మాట్లాడారు. పరిష్కారానికి ఎలాంటి సూచనలు చేయలేదు. అంటే సీనియర్లు ఇక ఓవరాక్షన్ చేయవద్దని నేరుగా చెప్పినట్లయింది. ఇప్పుడు సీనియర్ నేతలకూ క్లారిటీ వచ్చింది. అందుకే జగ్గారెడ్డి వంటి నేతలు.. మళ్లీ గాంధీభవన్ లో ఏఐసీసీ పెద్దలను కలవనని చెబుతున్నారు.
ఇప్పుడు సీనియర్లు అని వేరు కుంపటి పెట్టుకున్న నేతలు ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో వారు పాల్గొనరు. రేవంత్ నేతృత్వంలో పీసీసీ..త తన పని తాను చేసుకుపోతోంది. పాదయాత్ర కూడా ప్రకటించింది. ఆవేశపడి.. సీనియర్ నేతలు పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు పార్టీలోనే ఉన్నా.. వారికి ఆదరణ ఉండదు. బయటకు వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఇప్పుడు సీనియర్లు .. అటూ ఇటూ కాకుండా అయిపోయారు.