బీజేపీలో ఓ వెలుగు వెలిగిన రామ్మాధవ్ దీపం ఇప్పుడు ఆరిపోయింది. ఆయనను ఆరు నెలలుగా పార్టీలో ఏ పదవి లేకుండా పక్కన పెట్టడం.. ఏ బాధ్యతా అప్పగించకపోవడంతో.. ఆయన మళ్లీ తన మాతృ సంస్థ ఆరెస్సెస్కు వెళ్లిపోయారు. ఆయనను ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గంలో సభ్యుడిగా నియమించారు. దీంతో రామ్ మాధవ్ రాజకీయ కలలన్నీ కల్లలుగా మారిపోయినట్లయింది. ఆరెస్సెస్లోకీలక స్థానం నుంచి .. ఏకాఏకిన బీజేపీలో ప్రధాన కార్యదర్శి పదవికి వెళ్లిన రామ్ మాధవ్ ఆ తర్వాత పార్టీలో కీ రోల్ ప్లే చేశారు. ఈనాశ్య రాష్ట్రాల్లో బీజేపీ పతాకం ఎగరడం వెనుక ఆయన పాత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన రామ్మాధవ్ దక్షిణాదిలోనూ రాజకీయాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయనను అప్పుడప్పుడూ పొగుడుతూ ఉంటారు.
ఓ సందర్భంలో అమిత్ షా తర్వాత బీజేపీకి కాబోయే అధ్యక్షుడు రామ్ మాధవేనన్న ప్రచారం జరిగింది. ఆయన పలుకుబడి ఆ స్థాయిలో ఉండేది. అయితే అనూహ్యంగా ఆయనను మోడీ, షా దూరం పెట్టడం ప్రారంభించారు. పీడీపీతో పొత్తు.. కశ్మీర్ లో వైఫల్యం వంటి వాటికి ఆయనను బాధ్యుడ్ని చేశారు. ఆ తర్వాత పార్టీ పదవి తీసేశారు. రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఆయనను పార్టీ పదవి నుంచి తీసేసిన సమయంలో రాజ్యసభ సీటు ఇచ్చిన కేంద్రమంత్రిని చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ దాని గురించీ పట్టించుకోలేదు. ఇక బీజేపీలో భవిష్యత్ లేదనుకోవడం.. మోడీ, షా ఏ మాత్రం సానుకూలంగా లేకపోవడంతో.. ఆరెస్సెస్ కూడా.. ఆయనను మళ్లీ వెనక్కి పిలిపించాలని నిర్ణయించుకుని ఆ మేరకు బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది.
బీజేపీలో ఎదగాలంటే.. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. రామ్మాధవ్కు అది పుష్కలంగా ఉంది. మంచి వ్యూహకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. కానీ.. ఆరెస్సెస్కు మోడీ, షాలకు మద్య గ్యాప్ పెరిగిందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ మాధవ్ను వారిద్దరూ పట్టించుకకోపవడం… మళ్లీ ఆయన ఆరెస్సెస్కు వెళ్లిపోవడం.. బీజేపీ అంతర్గత రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. రామ్ మాధవ్తో పాటు మురళీధర్ రావు కూడా ఆరెస్సెస్ నుంచి ఒక్క సారే బీజేపీలోకి ప్రధాన కార్యదర్శి పదవిలోకి వచ్చారు. ఆయనకూ పార్టీ పరమైన బాధ్యతలేమీ లేవు కానీ… ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చక్కబెట్టడానికి ఏదో ఓ పని చెబుతూ ఉంటారు. దీంతో ఆయన మాత్రం ఇంకా బీజేపీలోనే ఉన్నారు.