బెంగాల్ టైగర్ తరవాత మరో దర్శకుడ్ని, మరో కథని ఎంచుకోవడానికి రవితేజ చాలా సమయమే తీసుకొన్నాడు. ఈలోగా ఎన్ని కథలు విన్నా… సంతృప్తి పడని మాస్ మహారాజా.. ఇప్పుడు ఓ కొత్త దర్శకుడి కథకి ఓకే చెప్పాడు. అతనే.. సిరి. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘రేసు గుర్రం’ చిత్రాలకు స్ర్కీన్ ప్లే రచయితగా వ్యవహరించిన విక్రమ్ సిరి… ఇప్పుడు రవితేజ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. వల్లభనేని వంశీ, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ”రవితేజ హీరోగా మా సంస్థలో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. మంచి కథ కుదిరింది. రవితేజ బాడీ లాంగ్వేజ్కి తగిన కథ ఇది. పూర్తి వివరాలు త్వరలో తేలియజేస్తామన్నారు.. నిర్మాతలు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో వెర్షన్ వినిపిస్తోందిప్పుడు. ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాలని వక్కంతం వంశీ ఓ కథని రెడీ చేసుకొన్నాడు. చాలాకాలంగా ఎన్టీఆర్ కోసం తిరుగుతున్నాడు కూడా. ఎన్టీఆర్ నో.. చెప్పడంతో ఇప్పుడు ఆ కథ పట్టుకొని రవితేజ కాంపౌండ్లోకి అడుగుపెట్టాడు వక్కంతం. రవితేజతో త్వరలోనే వక్కంతం ఓ సినిమా చేయబోతున్నాడని, అదీ ఎన్టీఆర్ కథతోనే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథ ఇదేనా?? అనే సందేహాలు కలుగుతున్నాయిప్పుడు. ఏది ఏమైనా.. రవితేజ కొత్త సినిమాకి కొబ్బరికాయ్ కొట్టే సమయం దగ్గర పడింది. మరి…. వక్కంతం దర్శకుడిగా ఎప్పుడు సెట్టవుతాడో??