ప్రభుత్వానికి బిగుస్తున్న ‘కాపుముడి’
ముద్రగడ పద్మనాభం దీక్ష ముగియడం ఇక లాంచనమే! అయినప్పటికీ, ఉద్రిక్తతలు సమసిపోయాయి. బిసి రిజర్వేషన్లను కాపులకూ వర్తింపజేయడంలో వున్న సమస్యలు తెలిసికూడా అరెస్టుల ద్వారా ముద్రగడను రెచ్చగొట్టినందువల్ల రిజర్వేషన్ల హామీ ఇచ్చిన చంద్రబాబు చూట్టూ ”కాపుముడి” మరింత బిగుసుకుంది.
నిజానికి కాపులను బిసిల్లోకి చేర్చటమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. అగ్రవర్ణాన్ని బిసిల్లోకి చేర్చాలంటే అందుకు ఒక కమీషన్ వేయాలి. జనాభా లెక్కలతో పాటు సామాజిక గణాంకాలు నమోదు చేయాలి. అవన్నీ ఒక ఫార్టేటులో పూర్తి చేసిన తర్వాత ఆర్టికల్ 9 కి సవరణలు కోరుతూ నివేదికను కేంద్రానికి పంపాలి. అప్పుడు ఆ నివేదికను కేంద్ర హోంశాఖ, న్యాయ శాఖ, అధ్యయనం చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకుని మంత్రివర్గ సమావేశం ముందుకు తెస్తుంది. మంత్రివర్గ సమావేశం ఆమోదంతో ఫైల్ సవరణలు కోరుతూ పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. పార్లమెంట్లో సవరణలు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపుతారు.
ఇదంతా చంద్రబాబుకి తెలియకకాదు… ఎన్నికల్లో గెలవడానికి చేసిన వాగ్దానాల్లో కాపులకు బిసి రిజర్వేషన్ కూడా ఒకటి. హామీలు అమలు చేయలేదని విమర్శించేవారే తప్ప నిలదీసేవారు సాధారణంగా వుండరు. అందుకు భిన్నంగా ముద్రగడ కాపుల రిజర్వేషన్ పై పట్టుబట్టారు. తునిలో సభపెట్టారు. రైళ్ళను తగలబెట్టారు. ముద్రగడ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ప్రభుత్వం హడావిడిగా మంజునాధ కమీషన్ ను నియమించింది. కమీషన్ రిపోర్టు రాకముందే రాంగ్ టైమ్ లో విద్వంసకారుల అరెస్టులు మొదలు పెట్టారు. ముద్రగడకు ఉద్యమలబ్ది దక్కనీయకుండా ఆయన అనుచరులు విధ్వంసకారులన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపడమే తెలుగుదేశం ఎత్తుగడగా అర్ధం చేసుకున్న ముద్రగడ మళ్ళీ దీక్ష ప్రారంభించారు.
ముద్రగడ జగన్ మనిషి అని మంత్రులే ఆరోపించడం మొదలు పెట్టారు. ఎవరు చెప్పినా వినని మొండి పెంకి వాడు అన్న విమర్శతప్ప ఇంటెగ్రిటీని శంకించే వీలు లేని వ్యక్తిత్వం ఆయనది. ఈ నేపధ్యంలో కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులందరూ ఏకతాటిపైకి రావటంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక వర్గం మొత్తం ఏకమవుతూండటం ఇతరజిల్లాలకు ఇది పాకుతూండటంలో ప్రభుత్వానికి దిగిరాక తప్పని పరిస్ధితి ఏర్పడింది.
ప్రతిష్ట దెబ్బతిని కూడా రాష్ట్రప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ సాధించగలదా అన్నది అనుమానమే. మంజునాద్ కమీషన్ రిపోర్టుని కేంద్రానికి పంపడం వరకే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో వున్న పని.
అయితే గుజరాత్ లో పటేళ్ళు, హర్యానాలో జాట్లు, రాజస్ధాన్లో గుజ్జర్లు రిజర్వేషన్లు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినా కేంద్రం పట్టించుకోలేదు. పైగా గుజరాత్లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్లోని కాపులను బిసిల్లోకి చేర్చే అంశానికి అంత ప్రాధాన్యత ఇస్తుందని ఎవరూ అనుకోవటం లేదు.
ఏ విధివిధానాలూ పాటించకుండా గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ ప్రకటిస్తే న్యాయస్ధానం కొట్టేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా గతంలో ఒకసారి అనుమానాన్ని వ్యక్తం చేసారు. అందుకనే కాపులను బిసిల్లో చేర్చటమనే ఎన్నికల హామీ అమల్లోకి రావటం అంత తేలికకాదని అర్ధమౌతోంది.
ఈ వ్యవహారమంతా చూస్తే కొండను తవ్వేస్తున్నారు ఎలుకనైనా పట్టుకోగలరా అన్న అనుమానం వస్తోంది.