భారత రాష్ట్ర సమితితో పొత్తులు పెట్టుకోబోం కానీ కేసీఆర్ మద్దతు అడిగితే మాత్రం పరిశీలిస్తామని వైసీపీలో విధాన నిర్ణయాలన్నీ తీసుకునే అధ్యక్షుడు కాని అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి అంశంపై స్పందించిన ఆయన…తాము ఏపీకి మాత్రమే పరిమితం కావాలనుకున్నామని అందుకే తెలంగాణలో పోటీ చేసే ఆలోచన చేయడం లేదన్నారు. భారత రాష్ట్ర సమితికి మద్దతు కావాలని కేసీఆర్ .. సీఎం జగన్ ను అడిగితే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరో వైపు కర్ణాటకలో కూడా వైఎస్ఆర్సీపీ పోటీ చేయబోతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ ఊహాగానాలేనని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము కర్ణాటకలో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అలా అనుకుంటే తమిళనాడులోనూ పోటీ చేయవచ్చన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే తెలంగాణలో రాజకీయ పోరాటం చేస్తున్న జగన్ సోదరి వైఎస్ షర్మిలకు కనీసం సంఘిభావం చెప్పడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
షర్మిలపై నర్సంపేటలో రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత ఆమెను రెండు సార్లు అరెస్ట్ చేశారు. ఓ సారి ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆస్పత్రి పాలయ్యారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఎలాంటి సానుభూతి కానీ మద్దతు కానీ లభించలేదు. స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించలేదు. వైఎస్ షర్మిలను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన రోజున.. అక్కడి రాజకీయాలతో తమకు ఏం సంబంధం లేదని సజ్జల స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు ఏపీ, తెలంగాణకు చెందిన 42 మంది ఎంపీలు కలసి కట్టుగా పని చేస్తే.. కేంద్రం మెడలు వంచవచ్చని.. ఏపీ ప్రత్యేకహోదాకు తాము మద్దతునిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కలసి కట్టుగా ఉంటే.. కేంద్రంలో చక్రం తిప్పవచ్చన్న ఆలోచన.. రెండు పార్టీల నేతల్లో ఉందని అంటున్న సమయంలో కేసీఆర్ అడిగితే అంటూ సజ్జల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.