శ్రుతిహాసన్ జోరు తెలుగులో బాగా తగ్గింది. శ్రీమంతుడు తరవాత.. ప్రేమమ్లోనే కనిపించింది. అయితే ఈ రెండు సినిమాలూ హిట్టే. ఇప్పుడు పవన్ కల్యాణ్ కాటమరాయుడులో కథానాయికగా నటిస్తోంది. రెండేళ్లలో రెండే సినిమాలు చేయడమేంటి? తెలుగు పరిశ్రమకు శ్రుతి దూరం అవుతోందా? లేదంటే తెలుగు పరిశ్రమే శ్రుతిని దూరం పెడుతోందా? ఇదే విషయంపై శ్రుతిహాసన్ స్పందించింది. ”నాకు అన్ని భాషలూ ముఖ్యమే. తెలుగు, తమిళం, హిందీల్లో నటిస్తున్నా కదా?? వివిధ భాషల్లో నటిస్తూ, అక్కడి సంస్క్రృతి సంప్రదాయాల్ని దగ్గరుండి గమనించడం, వారి అలవాట్లను పరిశీలించడం నాకు ఇష్టం. మా ఇంట్లో కూడా ఐదారు భాషలు మాట్లాడుతుంటారు. నాకు తెలీని ఓ కొత్త భాష నుంచి అవకాశం వస్తే.. చేతిలో ఉన్న సినిమాల్ని వదిలేసి మరి నటించడానికి సిద్దపడతా” అంటోంది శ్రుతి.
మిగిలిన భాషల నుంచి అవకాశాలు రావడంతోనే తెలుగు సినిమాల్ని తగ్గించిందట. అయితే తెలుగు ప్రేక్షకులంటే తనకు చాలా గౌరవమని, తనని నటిగా గుర్తించిన తొలి ప్రేక్షకులు తెలుగువాళ్లే అంటోంది. ”నా అభిమాన ప్రేక్షకులు తెలుగువాళ్లే. ఇక్కడే నాకు మంచి విజయాలు దక్కాయి. తెలుగు సినిమానీ, ఇక్కడి వాతావరణాన్ని మిస్ అవ్వడం నాకూ వెలితిగానే ఉంది. కాటమరాయుడుతో మరింత దగ్గరవుతానన్న నమ్మకం ఉంది. ఇక నుంచి కనీసం యేడాదికి మూడు తెలుగు సినిమాలుండేలా చూసుకొంటా” అని భరోసా ఇచ్చింది శ్రుతిహాసన్.