ఒకప్పుడు శ్రీనగర్, కాశ్మీర్ లో అప్పుడప్పుడు అల్లర్లు, భారత వ్యతిరేక ప్రదర్శనలు, బహిరంగ సభలు జరుగుతుండేవి. కానీ హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగిన 28 రోజుల తరువాత కూడా నేటికీ కాశ్మీరులో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయంటే అవి యాద్రుచ్చికంగానో, లేదా కాశ్మీరీ యువకులు ఏదో ఆవేశంతోనో చేస్తున్నవిగా భావించలేము. వాటిని చాలా పకడ్బందీ ప్రణాళికతో, పాక్ సహాయసహకారాలతో మాత్రమే నిర్వహిస్తున్నందునే సాధ్యమవుతోందని చెప్పక తప్పదు. నెలరోజులుగా కొనసాగుతున్న అల్లర్లని చూస్తే అవి ఇంకా ఎప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయనే అనుమానం కలుగుతోంది.
రాష్ట్రంలో చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న ఈ పాకిస్తానీ భక్తిని, దానితోబాటు నానాటికి పెరుగుతున్న వేర్పాటువాదాన్ని ఆ కారణంగా జరుగుతున్న ఈ అల్లర్లని అడ్డుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, ప్రాణాలు తెగించి గస్తీ కాస్తున్న భద్రతదళాలని ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ చేసినందుకు ప్రజలకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించినట్లు వార్తలు రావడం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తుంది. అటువంటి ప్రజలు, వేర్పాటువాదులకి, ఉగ్రవాదులకి మద్దతు తెలిపే ముఖ్యమంత్రి, వారికి అండగా పాకిస్తాన్ దాని ఉగ్రమూకలు ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అల్లర్లు జరుగకపోతే ఆశ్చర్యపోవాలి కానీ జరుగుతుంటే ఆశ్చర్యపోనక్కర లేదు.
నిన్న శుక్రవారం ప్రార్ధనల అనంతరం కాశ్మీరులో బుద్గాం, బారాముల్లా జిల్లాలలో సుమారు 24 చోట్ల ఒకేసారి ఆందోళనకారులు భద్రతాదళాలపై రాళ్ళతో దాడులు చేశారు. ఆ దాడులలో మరో ఇద్దరు కాశ్మీరు యువకులు చనిపోయారు. దానితో ఈ నెలరోజుల అల్లర్లలో చనిపోయినవారి సంఖ్య 52కి, గాయపడిన వారి సంఖ్య 2,000 దాటింది. నెలరోజులయినా అల్లర్లు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా ప్రాంతాలలో కర్ఫ్యూ కొనసాగించవలసి వస్తోంది.
భద్రతాదళాలపై దాడులు చేసినవారు గాయపడితే వారికి వేర్పాటువాదులు వైద్య చికిత్స అందించరు.వారిని అల్లర్లకి ప్రేరేపిస్తున్న పాక్ ప్రభుత్వం వైద్య చికిత్సలు అందించదు. మళ్ళీ భద్రతాదళాలే వారిని ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు చేయించవలసి వస్తోంది. భారత్ ని వ్యతిరేకిస్తున్న వారందరికీ అయ్యే ఆ వైద్య చికిత్సల ఖర్చులు, కాశ్మీరులో భద్రతాదళాలు మోహరింపు కోసం యావత్ భారతీయులు చెల్లిస్తున్న పన్నుల నుంచే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కాశ్మీరు ప్రజలని పాక్ ఉగ్రవాదుల బారి నుంచి కాపాడటం భారత భద్రతాదళాలు తమ ప్రాణాలని కూడా పణంగా పెడుతున్నాయి. అయినా కాశ్మీర్ లో భారత్ వ్యతిరేకత కనబడుతూనే ఉండటం చాలా దురద్రుష్టకరం. అందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీని, ఆ రాష్ట్ర రాజకీయ నేతలని నిందించక తప్పదు.