మే ఐదో తేదీ కల్లా కరోనా కంటికి కనబడకుండా పోతుందని.. గత ఏడాది కరోనా సమయంలో స్వరూపానందస్వామి డెడ్ లైన్ పెట్టారు. మహానుభావులు… ఇద్దరు ముఖ్యమంత్రులకు ఆస్థాన గురువుల్లాంటి వ్యక్తులు కాబట్టి ఎక్కువ మంది నమ్మారు. అయితే.. ఆ మే ఐదో తేదీ పోయి.. మళ్లీ ఏడాది మే ఐదో తేదీ కూడా వచ్చింది. వచ్చి వెళ్లిపోయింది. ఏడాది తర్వాత కూడా ఆ కరోనా స్వరూపాదనంద చెప్పినట్లుగా పోకపోగా..
.. అది కొత్త కొత్త వేరియంట్లతో జనాల్ని చంపుకు తింటోంది. అదే సమయంలో.. ఆయన ఉగాది పంచాంగ శ్రవణం చేసిన రోజునా … కొన్ని వ్యాఖ్యలు చేశారు. కరోనా ఉండదన్నట్లుగా జోస్యాలు చెప్పారు.
దీంతో సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ..మరోసారి హైలెట్ అయ్యారు స్వరూపానంద. మే ఐదో తేదీన కరోనా అంతమవుతుందని చెప్పారు కానీ.. ఏ సంవత్సరమో చెప్పలేదని సెటైర్లు వేయడం వేయడం ప్రారంభించారు. ఆయన వీడియో వైరల్ కావడం.. కొన్ని టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలు నిర్వహించడంతో.. శారదాపీఠం ఓ వివరణ ఇచ్చింది. జూలై చివరి కల్లా.. కరోనా తగ్గిపోతుందని స్వరూపానంద చెప్పారని.. కొంత మంది అవగాహన లేని వ్యక్తులు.. మే ఐదో తేదీ కల్లా.. వైరస్ అంతమవుతుందని చెప్పారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఉగాది పంచాంగ శ్రవణంలోనూ అదే స్వరూపానంద చెప్పారని శారదాపీటం చెబుతోంది. మొత్తానికి మార్చి పోతే సెప్టెంబర్ అని విద్యార్థులు అనుకున్నట్లుగా… ఇప్పుడు స్వామిజీలు కూడా.. మే కాకపోతే.. జూలై అని.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ స్వరూపానందకు జూలై గండం పొంచి ఉంది. అదే ఆయనకు మంచి అవకాశంగా కూడా కనిపిస్తోంది జూలై కల్లా కరోనా ఇండియా నుంచి పారిపోతే..ఆయనకు వీరతాళ్లు వేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. ఒక వేళ జూలై లోపు కరోనా వదలకపోతే… ఏదో ఓ యాగం చేయలేదు కాబట్టి.. పట్టిపీడిస్తోందని..ఆయన మరోసారి కవర్ చేసుకోవచ్చు. మొత్తానికి స్వరూపానందను నమ్మేవారు.. జూలై వరకూ ఊపిరిబిగబట్టుకుని ఉంటే చాలు… తర్వాత మాస్కుల్లేకుండా తిరిగేయవచ్చు.