కేసీఆర్ ప్రభుత్వంపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలతో జనంలోకి వెళ్తోంది. దానికి దీటుగా తెలుగు దేశం పార్టీ కూడా దూకుడుగా ముందుకెళ్లడానికి సిద్ధమైంది. రైతు సమస్యలతో పాటు ఇతర అంశాలపైనా కాంగ్రెస్ పార్టీ గత నెలలో వరసగా సభలు, దీక్షలు చేపట్టింది. ఇప్పుడు టీడీపీ రైతు సమస్యలపై పోరు యాత్ర తర్వాత విద్యార్థుల అంశంపై గళమెత్తనుంది.
విద్యార్థి పోరుయాత్ర పేరుతో ఈ నెల 9 నుంచి తలపెట్టింది. 11 విశ్వవిద్యాలయాల జేఏసీలను కలుపుకొని ప్రభుత్వంపై దండెత్తడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వానికి ఇబ్బందికరమే.
కేసీఆర్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించక పోవడంపై టీడీపీ మండిపడుతోంది. నియామకాలు లేక అవి నిర్వీర్యమయ్యాయని చెప్తోంది. ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ విద్యా వ్యవస్థకు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని టీడీపీ నేతలు లెక్కలతో సహా విమర్శిస్తున్నారు. తెలంగాణలోని కాలేజీలకు కేంద్రం నుంచి రావాల్సిన 3100 కోట్ల రూపాయల బోధన రుసుము సొమ్ము రాకుండా నిలిచిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలా ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. నిజంగానే ఇది తీవ్రమైన విషయం. దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాల్సి ఉంది.
తెలంగాణ సెంటిమెంటు విషయంలోనూ టీడీపీ కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. సీఎం కొత్త అధికారిక భవనం ప్రగతి భవనంలో ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో మొదట ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన జీయర్ స్వామికి కూర్చోబెట్టడం ఏమిటనేది టీడీపీ ప్రశ్న. మొత్తానికి ఈసారి దూకుడుగానే జనంలోకి వెళ్లడం ద్వారా ప్రభుత్వాన్ని తూర్పార బట్టడానికి తెలంగాణ తమ్ముళ్లు బాగానే ప్రిపేర్అయినట్టు కనిపిస్తోంది.