అడివి శేష్లో నటుడితో పాటు రచయిత కూడా వున్నాడు. హీరోగా పరిచయమైన ‘కర్మ’ సినిమాకి అతనే దర్శకత్వం వహించాడు. తరవాత మెగాఫోన్ పక్కన పెట్టేశాడు కానీ.. పెన్నుని పక్కన పెట్టలేదు. తను హీరోగా విజయాలు అందుకున్న ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలకు మూలకథలు అందించాడు. దర్శకులతో కలిసి స్క్రిప్ట్స్ రాశాడు. స్క్రిప్ట్ డిస్కషన్లలో మేజర్ రోల్ ప్లే చేశాడు. అతడు హీరోగా నటించి, కథ అందించిన ‘క్షణం’ సినిమాను హిందీలో ‘భాగి 2’ పేరుతో హీరో టైగర్ ష్రాఫ్ రీమేక్ చేశాడు. దాంతో హిందీ దర్శక నిర్మాతలు శేష్ అడివిని కథలు వుంటే చెప్పమని అడుగుతున్నారు. ఒకరికి దేశభక్తి కథను శేష్ చెప్పాడు. తాను 2008లో ఓ దేశభక్తి కథను అనుకున్నానని, హిందీవాళ్ళు అడగడంతో చెప్పగా… వాళ్ళకి నచ్చిందని అడివి శేష్ తెలిపాడు. అయితే… ఎవరికి కథ చెప్పారు? అందులో హీరో ఎవరు? అనేది చెప్పలేదు. త్వరలో ఆ విషయాలు చెబుతానని, ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నాడు.