టీఆర్ఎస్ – బీజేపీ దాడుల రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం అంతా టీఆర్ఎస్ నేతలు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా ఆయన నియోజకవర్గం పరకాలలో బంద్ పాటించారు. వరంగల్ జిల్లాలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు. రాత్రి అంతా బీజేపీ నేతల ఇళ్లపై వరుస దాడులు జరిగాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు మండిపడ్డారు. మంగళవారం.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.
దీంతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు తమ జోలికి వస్తే ఊరుకోబోమని.. తాము అధికార పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఇదే ఎఫెక్ట్ కోసం బీజేపీ నేతలు చూస్తున్నట్లుగా ఉంది. టీఆర్ఎస్ నేతల్ని వీలైనంతగా రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే బీజేపీ నేతలు ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. తమ నేతలపై దాడులు చేస్తున్నారని… ఆపకపోతే.. తాము ఊరుకోబోమని అంటున్నారు. అయోధ్య విరాళాల అంశం సున్నితమైనది కావడంతో బీజేపీ నేతలు దీన్ని మరింత పెద్దది చేయాలనుకుంటున్నారు.
రామాలయం నిర్మాణానికి కేసీఆర్ అనుకూలమా కాదా.. అన్న వాదన తీసుకు వస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాము రాముడి ఆలయానికి వ్యతిరేకం కాదని.. బీజేపీ నేతల దందాకే వ్యతిరేకమని చెబుతున్నారు. ఈ వివాదం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో వరంగల్ మేయర్ ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఈ వివాదాన్ని ఇలా కొనసాగించాలనే వ్యూహం బీజేపీలో ఉందంటున్నారు.