హుజూర్ నగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని ఇప్పుడు తెలంగాణలో సీపీఐ పార్టీకి డిమాండ్ పెరిగింది! తమకు మద్దతు ఇవ్వాలంటూ ప్రధాన పార్టీలైన తెరాసతోపాటు కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది. ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలంటూ తెరాస నేతలు ఇప్పటికే సీపీఐ కార్యాలయానికి వెళ్లొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే స్పందించేసి… కమ్యూనిష్టుల విషయంలో గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఏమన్నారో, ఎంత అవమానకరంగా వ్యవహరించారో గతం గుర్తు చేసుకోవాలనీ, ఆ పార్టీతో కలిసి వెళ్లొద్దని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ తో కమ్యూనిష్టులు, టీడీపీ కూటమిగా కలిసి పనిచేశారు. ఈ ఉప ఎన్నికకు వచ్చేసరికి ఎవరి దారి వారిదైపోయింది. చివరి నిమిషంలో టీడీపీ సొంతంగా అభ్యర్థిని ప్రకటించడం, కమ్యూనిష్టులను తెరాస సంప్రదించడం ఇప్పుడు కాంగ్రెస్ కి కొంత ఇబ్బందికరమైన పరిస్థితే అన్నట్టుగా మారింది! గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు వేల ఓట్లతో హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీడీపీ ఓట్లన్నీ ఉత్తమ్ కి పడ్డాయనీ, ఆయన గెలుపులో అవే కీలకమయ్యాయనే విశ్లేషణలు అప్పుడొచ్చాయి. ఇప్పుడు టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగడంతో ఆ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి ఓట్లు బదిలీ అయ్యే అవకాశం తగ్గింది అనే అభిప్రాయాల్ని కొందరు కాంగ్రెస్ నేతలే వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
పార్లమెంటు ఎన్నికల సమయంలో టీడీపీని పోటీ చెయ్యొద్దంటూ ముందుగానే ఉత్తమ్ ఒప్పించారు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే టీడీపీ పోటీకి దూరంగా ఉండాలనే నచ్చజెప్పారు. అయితే, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కొంతమంది కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతోంది. కమ్యూనిష్టుల విషయంలో కూడా ఉత్తమ్ కొంత ఆలస్యమయ్యారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెరాస వెళ్లలోపుగానే వారి మద్దతు కోసం ఉత్తమ్ ప్రయత్నించి ఉండాల్సిందని అంటున్నారు! ఇప్పుడు కమ్యూనిష్టుల మద్దతు కోసం ఉత్తమ్ ప్రయత్నిస్తున్నా… ఇప్పటికే తెరాస నేతలు సీపీఐ కార్యాలయానికి వెళ్లొచ్చారు! అంటే, సీపీఐ కూడా తెరాసతో కలిసి పనిచేసేందుకు దాదాపు సంసిద్ధంగా ఉంది కాబట్టే తెరాస నేతల్ని వారి కార్యాలయం వరకూ రానిచ్చారు. ఒకవేళ వద్దనుకుంటే ఈ ప్రతిపాదన తెర వెనకే ఉండిపోయేంది. టీడీపీ, కమ్యూనిష్టుల మద్దతు కోసం ఇంకాస్త ముందుగా ఉత్తమ్ ప్రయత్నించి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ నేతలు కొందరు అంటున్నారు.