ఎడిటర్స్ కామెంట్ : బీజేపీ ఎన్నికల కమిషన్ !

” ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటే మాత్రమే ప్రజాస్వామ్యం కాదు.. ప్రజలందరికీ స్వేచ్చగా తమ ప్రభుత్వాలను ఎన్నుకునే అధికారం ఉన్నదే అసలైన ప్రజాస్వామ్యం “. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ మేరకు కిరీటం కూడా పెట్టారు. కానీ మన ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్యదేశానికి లేని అవలక్షణాలు అన్న ఉన్నాయి. ఓట్లు కొనుగోలు చేయడం.. ప్రజల సొమ్మును వారికే పంచి ఓట్ల రాజకయం చేయడం సహా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ఆశ్చర్యపోయే ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎన్నికునే ప్రజలకు అధికారం లేకుండా.. చాయిస్ లేకుండా చేసే ప్రజాస్వామ్య లక్షణం కూడా వచ్చేస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఎన్నికల కమిషన్‌ను నియమించుకునేందుకు సిద్ధమయింది. ఈ మేరకు పార్లమెంట్ లో బిల్లు పెట్టింది. ఇలా కేంద్రంలో ఉన్న వారు ఎన్నికల కమిషన్ ను నియమించుకుంటే..ఎన్నికలు ఎలా జరుగుతాయో.. శాంపిల్‌గా 2019 ఎన్నికల ఫలితాలను చూడవచ్చు. ముందు ముందు ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉండబోతోంది. ఎందుకంటే.. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి న బిల్లు ప్రకారం ఇక ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీనే నియమించుకుంటారు. అంటే.. ఎన్నికలను ఆయనే నిర్వహిస్తారని అనుకోవచ్చు.

పాలకులే ఎన్నికలు నిర్వహించుకునే దిశగా దేశ ప్రజాస్వామ్యం

ఉత్తరకొరియాలో ఎన్నికలు జరుగుతాయని మీకు తెలుసా ?. హమ్మ…కిమ్ కు వ్యతిరేకంగా పోటీ చేసే మొగోడు కూడా ఉ.కొరియాలో ఉంటాడా అనుకోవచ్చు. నిజమే ఎవరూ ఉండరు. ఉత్తరకొరియలో ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కమిషన్ కూడా ఉంటుంది. ఆ కమిషన్ ను కిమ్ నియమిస్తారు. ఆ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది..కానీ కిమ్ తప్ప ఇంకెవరి నామినేషన్లు దాఖలు చేయడానికి రూల్స్ అంగీకరించవు. ఏకగ్రీవం కూడా ఉండదు. ప్రజలంతా విధిగా
ఓట్లేయాల్సిందే. బ్యాలెట్ మీద ఒక్క కిమ్ పేరు మాత్రమే ఉంటుంది. ఇలాంటి ఎన్నికల్ని మనం ఎన్నికలు అంటామా ?. అనకపోవచ్చు కానీ.. మన దేశంలోనూ అలాంటి పరిస్థితి రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. గత కొన్నాళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు చూసి చాలా మంది ప్రజాస్వామ్య వాదులు ఇక కొన్నాళ్లకు మన దేశంలో ఇక ప్రజాస్వామ్య అవసరం ఉండదేమో అని బాధపడ్డారు. దాన్ని నిజం చేసేలా ఇప్పుడు.. ఎన్నికల సంఘాన్ని పూర్తిగా జేబులో పెట్టుకునేల ఓ కొత్త బిల్లును పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశ పెట్టింది. దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే ప్రధాన ఎన్నికల కమిషనర్ సహా ఈసీల నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై కేంద్రం పార్లమెంట్‌లో ఓ బిల్లు పెట్టింది. కొత్త బిల్లు ఎన్నికల కమిషన్‌ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర లేకుండా చేసింది. ఇప్పటి వరకూ సీఈసీ ఎంపిక ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు ఉండేది. ప్రధాని, ప్రతిపక్ష నేతతో పాటు సీజేఐ నేతృత్వంలోని కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేది. బిల్లు పాసయితే .. సీజేఐకి సంబంధం ఉండదు. జనరల్ ఎలక్షన్ ను నిర్వహించే ఎన్నికల సంఘం నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కాదని చట్టం చేసేస్తోంది కేంద్రం.

సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ కొత్త చట్టాలు

భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అత్యంత కీలకం. ఎన్నికలు నిర్వహించేటప్పుడు వ్యవస్థలన్నీ ఎన్నికల సంఘం అధీనంలో ఉంటాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. నియంత్రణ మొత్తం ఈసీ చేతుల్లో ఉంటుంది. ఎన్నికలను నిష్ఫక్షిపాతంగా ఈసీ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి నమ్మకమే పునాది. ఈ నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల సంఘం విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల కమిషన్‌లో చీప్ కమిషనర్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇప్పటి వరకూ వీరి నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ ఉంటారు. అయితే ఈ పద్దతికి రాజ్యాంగబద్దత లేదు. ఆర్టికల్ 342 ప్రకారం, ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి సిఫారసుపై …రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ లో ని సీఈసీని, ఇతర ఎలక్షన్ కమిషనర్లను నియమిస్తారు. ప్రజాస్వామ్య సౌధానికి మూలమైన ఈ ఎలక్షన్ కమిషన్ అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వ సిఫారసుతో ఏర్పాటవుతోంది. ఈ ప్రక్రియను తప్పు పడుతూ.. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు 2015నుంచి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. వీటిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండాలని పేర్కొంది. కీలకమైన ఎన్నికల ప్రక్రియలో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం తప్పని సరి అని చెబుతూ… ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను భాగస్వామ్యం చేయాలని విస్పష్టంగా చెప్పింది. త్వరగా దీనిపై చట్టాన్ని చేయాలని ఆ లోగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముక్తకంఠంతో చెప్పింది. అప్పట్నుంచి పద్దతి మారిపోయింది.

అందరిక ఒకే రూల్స్ వర్తించని ఎన్నికలతో ప్రజాస్వామ్యం నిలబడుతుందా ?

అయితే ఈ పద్దతికీ చట్టబద్దత కల్పించాల్సి ఉంది కాబట్టి.. చట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. చట్టం చేసే క్రమంలో.. పాత విధానానికే చట్టబద్ధత కల్పిస్తున్నారు. కానీ సీజేఐకి స్థానం ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈసీలతో కూడిన కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు. దీని ప్రకారం సీఈసీ, ఇతర ఎలక్షన్ కమిషనర్‌లను ముగ్గురు సభ్యుల ప్యానల్ ఎంపిక చేస్తుంది. ఇందులో ప్రధానమంత్రి, లోక్ సభ లో ప్రతిపక్షనేత, ప్రధాని నామినేట్ చేసిన ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఒక వేళ ప్రతిపక్ష నేత హోదా ఎవరూ పొందకపోతే.. ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీకి చెందిన ఫ్లోర్‌ లీడర్ సభ్యుడిగా ఉంటారు. ఏకపక్ష నియామక వ్యవస్థను సమర్థించేలా కొత్త చట్టం ఉండొద్దన్నది సుప్రీంకోర్టు ఆదేశం. కానీ దానిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం సీఈసీ నియామకాన్ని ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు చేస్తోంది. అంటే ప్రధానిదే నిర్ణయం అనుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన బిల్లులో ప్రధానితో పాటు.. ప్రతిపక్షనేత, మరో కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ప్రధాని నియమించిన కేబినెట్ మంత్రి అంటే కచ్చితంగా ఆయన ప్రధాని చెప్పినట్లు వినాల్సిందే. ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఓ వ్యక్తిని సమర్థిస్తే. అతనే సీఈసీ అవుతాడు. అంటే.. ప్రధాని చాయిసే చీఫ్ ఎలక్షన్ కమిషనర్.. కమిషనర్లు కూడా. ఇక ఈ చట్టంలో పారదర్శకత ఎలా ఉంటుంది. ప్రధాని నియమించే ఎన్నికల కమిషనర్ స్వేచ్చగా పని చేయగలుగుతారా ?

దేశ ప్రజాస్వామ్యానికే పెనుగండం !

నిజాయితీగా ఉండటమే నిజాయితీగా ఉన్నట్లుగా కనిపించాలి కూడా. ఎన్నికల సంఘం ఎంత సీరియస్‌గా పని చేసినా.. నిజాయితీగా వ్యవహరించినా.. అలా ఉన్నట్లుగా కనిపించడం కూడా కీలకమే. లేకపోతే పక్షపాత ముద్ర పడిపోతుంది. అది దేశ ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తుంది.మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ భవితవ్యమే ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థలో అలాంటి కీలకమైన విభాగం ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే సుప్రీంకోర్టు ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం కూడా ఉండాలని కోరుకుంది. ఈసీఐ నియామకం పారదర్శకంగా ఉండాలంటే.. ఇది తప్పనిసరి అని చెప్పింది. రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలన్నా కూడా న్యాయ వ్యవస్థ జోక్యం ఉండాలని సుప్రీంకోర్టు భావించింది. కానీ మోదీ ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సుప్రీం చెప్పినట్లుగా చేస్తే… ఒకవేళ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకే అభిప్రాయం కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని శాసించగలిగేటువంటి.. ఎలక్షన్ కమిషన్ నియామకంలో అధికార పార్టీ మాట చెల్లుబాటు కావాలని ్మోదీ కారుకుంటున్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం వచ్చే ఎన్నికల తర్వాతనే పూర్తవుతుంది. అయితే ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అనూప్ చంద్ర పాండే పదవీకాలం ఎన్నికలకు ముందు ఫిభ్రవరిలో పూర్తవుతుంది. అప్పుడు కొత్త ఎలక్షన్ కమిషనర్ ను ఎన్నుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం చట్టం ప్రకాకం కమిషనర్లను నియమిస్తే.. వారు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ఈసీఐని కీలుబొమ్మగా మార్చే పన్నాగమని రాజకీయ పార్టీలు ఇందుకే ఆరోపిస్తున్నాయి. మిగతా రాజకీయ పక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పనితీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. చివరికి దేశ ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటు కూడా గందరగోళంలో పడిపోతోంది. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసిన తర్వాత.. దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. ఆధార్ తప్పనిసరి కాదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ..అధికారులు ఆధార్ తో అనుసంధానం చేసేశారు. కానీ ఇలాంటి వారి ఓట్లు కూడా రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారు అడ్డగోలుగా డిలీట్ చేస్తే.. ఈసీ ఎందుకు స్పందించలేకపోతోంది. గెలుపోటమలు తేలేది.. ఐదు.. పది వేల ఓట్ల తేడాతోనే. ఆ ఐదు పదివేల ఓట్లను తీసేస్తే ఫలితాలను మార్చేసినట్లే. ఇంక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్లు..ఎన్నికలు పెట్టడం ఎందుకు ? అదే సమయంలో ఎన్నికల నిర్వహణ సమయంలో.. ఓ పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం అనేది ఈసీ చర్యల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు.. ముందు ముందు మరింత వరస్ట్ గా తయారవుతాయి. ఎందుకంటే.. ఈసీ నియామకాలు ..అదేలా ఉండబోతున్నాయి మరి !

అంపైర్లూ ఓ టీములో ఉంటే ఇక ప్రత్యర్థి వైపు ప్రజలున్నా ప్రజాస్వామ్యం గెలవదు !

ఏదైనా ఆటలో గెలుపోటముల్ని నిర్ధారించేది అంపైర్ నిష్పక్షపాతమే. రెండు, మూడు నిర్ణయాలు తప్పుడువి తీసుకుంటే ఫలితం తారుమారవుతుంది. క్రికెట్ , ఫుట్ బాల్ వంటి ఆటల్లో మాత్రమే కాదు.. ఎన్నికల్లోనూ ఈ అంపైర్లు కీలకమే. ఎన్నికల్లో అంపైర్లు అంటే… ఎన్నికల కమిషనే. ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా నిర్వహిస్తే.. ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. అలాంటి నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఈసీది. కానీ ఏకపక్షంగా ఓ వైపు వ్యవహరిస్తే ఏమవుతుంది ?. ఎన్నికలపై నమ్మకం తగ్గుతుంది. ఎన్నికల్లో ఈవీఎంలపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. అసాధారణ ఫలితాలు వస్తూండటంతో రాజకీయ పార్టీలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. గెలిచిన పార్టీలు… తమ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేయలేవు. ఓడిన పార్టీలు.. వ్యక్తం చేస్తాయి. అందుకే ఎప్పుడూ ఈ విషయంపై ఏకాభిప్రాయం రాదు. ఎన్నికల సంఘం నియామకంలోనూ అంతే. కానీ.. ఆలోచించాల్సింది ప్రజాస్వామ్య మనుగడ గురించి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close