బుద్దా వెంకన్న సోదరుడు.. బుద్దా నాగేశ్వరరావు వైసీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యంత ఆప్యాయంగా.. గుండెలకు హత్తుకుని.. పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. జగన్ ఖాతాలో మరో విజయం పడిందని.. వైసీపీ నేతలు.. సాక్షి మీడియా సంబరాలు చేసుకున్నారు. బుద్దా నాగేశ్వరరావు.. బుద్దా వెంకన్నకన్నా.. గొప్ప నేత అని… బీసీల కోసం తెగ పోరాడేశారని కథలు .. కథలుగా సాక్షిలో రాసుకున్నంత పని చేశారు. నిజంగా బుద్దా నాగేశ్వరావు.. సాక్షిలో చెప్పినట్లుగా.. ప్రజానేతగా ఎదిగారా.. అంటే… దానికి పాత సాక్షి పత్రిక కథనాలే మనం రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మూడేళ్ల కిందట… విజయవాడలో ఓ కేసు సంచలనం సృష్టించింది. ఆ కేసు కాల్ మనీ కేసు. వైసీపీ దీన్ని మరింత విస్తృత అర్థంలో “కాల్ మనీ – సెక్స్ రాకెట్”గా చెబుతూ ఉంటుంది. ఆ కేసు నిందితులంతా.. తెలుగుదేశం పార్టీ వాళ్లేనని కథలు కథలు గా ప్రచారం చేసింది. అందులో కీలక వ్యక్తి.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు.. బుద్దా నాగేశ్వరరావు. ఈ బుద్ధా నాగేశ్వరరావుపై.. అప్పట్లో సాక్షిలో లెక్క లేనన్ని కథనాలు వచ్చాయి. ఆయనను.. చంద్రబాబే కాపాడారని.. రాసుకొచ్చింది. ఆ సమయంలో… పోలీసులు.. ఈ బుద్దా నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. ఆయనపై కేసులు కూడా పెట్టారు. నిజానికి సోదరునితో బుద్దా వెంకన్నకు… సత్సంబంధాలు లేవని.. కుటుంబ పరంగా విడిపోయామని.. చాలా సార్లు వెంకన్న చెప్పినా సాక్షి పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ ఎమ్మెల్సీ సోదరుడు కాబట్టి… చల్లాల్సినంత బురద చల్లేశారు.
కానీ ఇప్పుడు… అదే బుద్దా నాగేశ్వరరావు… పరుగులు పెట్టుకుంటూ.. వైసీపీలో చేరతానని వస్తే… అంత కంటే అదృష్టం లేదన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… ఆయనను… అత్యంత గౌరవంగా తోడ్కొని జగన్ వద్దకు తీసుకెళ్లారు. జగన్ ఆయనకు కండువా కప్పి గొప్ప విజయం సాధించినట్లు ఫీలయ్యారు. కానీ.. తాము అంతకుముందు ఆయనపై చేసిన ఆరోపణలు.. కాల్ మనీ… సెక్స్ రాకెట్ వ్యవహారాల గురించి మాత్రం గుర్తుంచుకోలేకపోయారు. అంటే.. నేరస్తుడ్ని అయిన పార్టీలో చేర్చుకుని ఉండాలి లేకపోతే… తాము.. తమ పత్రిక చేసిన ఆరోపణలు తప్పయినా ఉండాలి. ఏది జరిగినా.. వైసీపీకి విలువలు లేవనే మాట మాత్రం స్పష్టమవుతోంది.