మోడీకి దండం పెట్టిన మరో పార్టీ..! బీజేపీయేతర కూటమికి జై..!!

బీజేపీ నేతృత్వంలోనే నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ నుంచి మరో పార్టీ వైదొలిగింది. బీహార్ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు.. ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. ఆయన తన పదవికి కూడా రాజీనామా చేసి.. కేబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీహార్ కు ఏమీ చేయలేదని.. అందుకే.. పదవికి వదులుకుని..ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు కుష్వాహా ప్రకటించారు. ఆర్ఎల్ఎస్పీ… ఆర్జేడీతో చేతులు కలిపి.. బీజేపీయేతర కూటమిలో చేరాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీయేతర కూటమి సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ పరిణామం జరగడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయింది.

మోడీ బీహార్ కు ఏమీ చేయకపోవడం వల్లే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు కుష్వాహా ప్రకటించినా.. అసలు కారణం మాత్రం లోక్ సభ సీట్ల పంపణీలో ఏర్పడిన అసంతృప్తే. గత లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో… బీజేపీ, రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి, కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్పీ పార్టీలు కలిస పోటీ చేసి ఘన విజయం సాధించాయి. అప్పట్లో.. కుష్వాహా పార్టీకి ఆరు సీట్లు కేటాయించారు. అప్పట్లో లాలూ ప్రసాద్ కు చెందిన ఆర్జేడీ, నితీష్ కుమార్ జేడీయూ విడివిడిగా పోటీ చేశాయి. దాంతో బీజేపీ పని సులువయింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలసి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీ వ్యూహకర్తలు .. లాలూను జైలుకు పంపి.. నితీష్ కుమార్ తో లాలూచీ పడి ఆర్జేడీని ప్రభుత్వం నుంచి గెంటేసి.. ఆ స్థానంలో బీజేపీ వచ్చి చేరింది. దాంతో సమీకరణాలు మారిపోయాయి.

ఇప్పుడు.. జేడీయూ, బీజేపీ, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీలు బీహార్ లో ఉన్న 40 సీట్లను పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఉన్న సీట్లలో చెరో పదిహేడు స్థానాల్లో పోటీ చేయాలని జేడీయూ, బీజేపీ నిర్ణయించుకున్నారు. ఆరు స్థానాలు మిత్రపక్షాలకు ఇవ్వాలనుకున్నాయి. ఇందులో ఒక్కటి మాత్రమే కుష్వాహాకు ఇస్తామని ప్రతిపాదించారు. కానీ ఇప్పుడే ముగ్గురు ఎంపీలు ఉన్న కుష్వాహా .. ఒక్క సీటుకు అంగీకరించలేదు. అందుకే బీజేపీయేతర కూటమిలో చేరారు. వాస్తవానికి… సీట్ల సర్దుబాటుపై అసంతృప్తితో నితీష్ కుమారే.. బీజేపీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఎలాగోలా సెటిల్ చేసుకున్నారు కానీ.. కుష్వాహాను సంతృప్తి పరచలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.