ఈ తరం ప్రజలు కనీ వినీ ఎరుగని వర్షాలతో హైదరాబాద్ జల మయమైంది. రోడ్లు కాలువలయ్యాయి. కాలనీలు చెరువులుగా మారాయి. అపార్ట్ మెంట్ సెల్లార్లు కుంటలుగా మారాయి. దీనికి వరుణుడి కుండపోత ఓ కారణమైతే, మానవ నిర్లక్ష్యం మరో కారణం.
నిజాం జమానాలో, ఎప్పుడు 1905లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ అండర్ గ్రౌండ్ డ్రయినేజితో పాటు వరదనీటి నుంచి సంరక్షణ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారు. దాని ప్రకారం పక్కాగా నిర్మాణాలు చేయించారు. ఆనాటి రక్షణ వ్యవస్థ ఛిద్రమైన ఫలితమే, హైదరాబాద్ కు వరద ముప్పు.
నగరంలో ఎంత భారీ వర్షం కురిసినా సత్వరం వరదనీరు డ్రయినేజీల్లోకి వెళ్లేలా, ఆ తర్వాత అటు హుసేన్ సాగర్ లో ఇటుమూసీలోకి ప్రవహించేలా విశ్వేశ్వరయ్య డిజైన్ చేశారు. కాలక్రమంలో కబ్జాలు పెరిగాయి. నాలాలు, చెరువులపై భవనాలు వెలిశాయి. హుసేన్ సాగర్ ఎదురుగానూ భవంతుల నిర్మాణం జరిగింది.
నగరంలోని వందల చెరువులు మాయమయ్యాయి. నిజాంపేటలోని అపార్ట మెంట్ల ప్రజలు ఒక ద్వీపంలో ఉన్నట్టుగా ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేయడం దీనికి ప్రధాన కారణం. వరద నీరు పోవడానికి దారే లేకుండా పోయింది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి.
ప్రతిదానికీ గత పాలకుల పాపమే కారణమని తిడుతూ కూర్చుంటే సరిపోదు. ఇప్పటి పాలకులు ఏం చేస్తారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ కు మరోసారి పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్, సరైన యాక్షన్ప్ ప్లాన్ అవసరం. చెరువులు, నాలాలపై కబ్జాలను తొలగించకపోతే అనర్థం తప్పదు
హైటెక్ నగరం, సైబరాబాద్ అని మురిసిపోతున్న అనేక పోష్ ఏరియాల్లో సరైన అండర్ గ్రౌండ్ డ్రయినేటీ వ్యవస్థ లేదు. విశ్వేశ్వరయ్య రూపొందిన వ్యవస్థను కాపాడుకుంటూనే, కొత్త ప్రాంతాలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది. వర్షం పడిన ప్రతిసారీ మోకాలిలోతు నీరు నిలిచే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అయినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం దారుణం. పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతంలో ప్రతిసారీ ఎందుకు మడుగులా నీరు నిలుస్తోందని ఆలోచించరా? అక్కడ లోపం ఏమిటో గుర్గించరా? దాన్ని సరిచేయరా?
గత పాలకుల నిర్లక్ష్యం సరే. ఇప్పటి ప్రభుత్వంలో తండ్రి ముఖ్యమంత్రి. కొడుకు మున్సిపల్ మంత్రి. మరి తండ్రీకొడుకులు హైదరాబాద్ ను నిజంగా విశ్వనగరంగా చేస్తారో, విశ్వ గుంతల నగరంగా కొనసాగిస్తారో చూద్దాం.