ఎన్డీయేతో కటీఫ్ చేసుకున్న దగ్గర నుంచీ తెలుగుదేశం ఎదురీత మొదలైందని చెప్పాలి. ఎన్నికలకు ఏడాదే సమయం ఉంది, ఈలోగా కేంద్ర సాయం అరకొర, అదనంగా రాజకీయ కక్ష సాధింపులు… ఇవన్నీ టీడీపీకి సవాళ్లుగానే మారాయి. అన్నిటికీ మించిన సవాల్… ఏడాదిపాటు ప్రత్యేక హోదా వేడిని, భాజపా వైఖరిపై ప్రజల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకతను ఒడిసిపడుతూ సాగడం. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతల పనితీరుపై కొంత ఆవేదన వ్యక్తం చేశారు, కొంతమందిని హెచ్చరించారు.
టీడీపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. జూన్ 2 లోగా వారి రాజీనామాలు ఆమోదం పొందాలనీ, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదనీ, ఆ తరువాత ఆమోదం పొందినా అక్కడికి సార్వత్రిక ఎన్నికలు ఏడాదిలోపే ఉంటాయి కాబట్టి, ఉప ఎన్నికలకు నిర్వహించే అవకాశం ఉండదన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భాజపా, వైకాపా నేతలు కలిసి ఎలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో ప్రతీరోజూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్రం వైఖరిపై నిరసనగా వైకాపా ఎంపీలు రాజీనామాలు చేశారనీ, కానీ భాజపాపై ఇప్పటికీ విమర్శలు చేయని వైనాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నారు.
ఇక్కడి నుంచి ఎన్నికల వరకూ అవిశ్రాంతంగా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, లేదా మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందనీ, ఆలోగా ప్రణాళిక ప్రకారం తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలనీ, ఇసుక రవాణా, బెల్టు షాపులు వంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పార్టీ ఆశిస్తున్నట్టు పనిచేయలేమని అనిపిస్తే ముందే తప్పుకోవాలని సూటిగా చెప్పేశారు. తాజాగా నిర్వహించిన సైకిల్ యాత్రని కొంతమంది ఎమ్మెల్యేలు మొక్కుబడి కార్యక్రమంగా చేశారని మండిపడ్డారు.
ఇలా కాస్త ఘాటుగానే పార్టీ రాష్ట్ర స్థాయి నేతల సమావేశం జరిగింది. ఏడాదిపాటు పార్టీ శ్రేణుల్ని నడిపిస్తూ… ప్రజల్లో హోదా స్ఫూర్తిని కాపాడుకుంటూ, వైకాపా, భాజపాల వ్యూహాలను తట్టుకుంటూ, సొంత పార్టీ నేతల్ని గాడి తప్పకుండా చూసుకుంటూ, ఇదే క్రమంలో నాలుగేళ్లపాటు టీడీపీ సర్కారు ఏం చేసిందనేది చెప్పుకుంటూ, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు సాగడం అనేది టీడీపీ ముందున్న గట్టి సవాలే. అందుకే, ఈ సమావేశంలో అప్రమత్తతతో కూడిన ఆవేదనను చంద్రబాబు వ్యక్తం చేశారని చెప్పుకోవాలి.