తెలుగు పరిశ్రమలో వినసొంపైన బాణీలకు ప్రసిద్ద ఎం.ఎం.కీరవాణి. ఎం.ఎంలో ఒక ఎం.. ‘మధురం’ మరో ఎం.. ‘మెలోడీ’ అంటుంటారు ఆయన అభిమానులు. తెలుగు సినిమాలో తెలుగు పాటలోని తెలుగు పదం చెవులకు వినసొంపుగా సోకుతోందంటే.. అందులో కీరవాణి పుణ్యం కూడా ఉంది. తెలుగు పాటకు పట్టం కట్టి, ఎన్నొ అద్భుతమైన బాణీలు అందించిన ఘనత ఆయనది. మాస్ పాటలు, క్లాస్ గీతాలు, ఆధ్యాత్మిక గీతికలు ఇలా అన్నిరకాల పాటలూ అందించారు కీరవాణి. ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలున్నాయి. ప్రస్తుతం బాహుబలి 2, ఓం నమో వేంకటేశాయ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. అయితే.. త్వరలోనే కీరవాణి అస్త్ర సన్యాసం చేయబోతున్నారు. ”నేను త్వరలో.. రిటైర్మెంట్ తీసుకొంటున్నా” అంటూ గతంలోనే సంకేతాలు ఇచ్చారు కీరవాణి. అయితే ఇప్పుడు అందుకు మూహూర్తం కూడా కుదిరిందని తెలుస్తోంది.
2016 డిసెంబరు నాటికి చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి కెరీర్ని ముగించాలనుకొంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బాహుబలి 2కి సంబంధించిన ఆర్.ఆర్ పనులు సాగుతున్నాయి. 2016 చివరికల్లా ఆయా పనులు ఓ ముగింపు దశకు వస్తాయని భావిస్తున్నారు. ఓం నమో వేంకటేశాయ వర్క్ కూడా డిసెంబరు నాటికి పూర్తవుతుంది. తన చివరి పనిదినం ‘ఓం నమో వేంకటేశాయ’తో ముగించాలని కీరవాణి నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంటే 2017 నుంచీ కీరవాణి కొత్త జీవితం మొదలెట్టనున్నారన్నమాట. నవతరం సంగీత దర్శకులు తమ జోరు చూపిస్తున్న తరుణమిది. వాళ్లకు అవకాశం ఇస్తూ కీరవాణి ఈ పోటీ నుంచి తప్పుకోవాలని, తన వ్యక్తిగత జీవితాన్ని ఆయన అభిరుచులకు అనుగుణంగా సాగించాలని కీరవాణి సినిమాలకు గుడ్బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. రాఘవేంద్రరావు, రాజమౌళి చిత్రాలంటే కీరవాణి సంగీతం ఉండాల్సిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించుకోవాల్సిందే.