ఈనెల 5వ తారీఖున ప్రభాస్ అభిమానులకు ఓ అద్భుతమైన విషయం చెబుతా అంటూ బాహుబలి 2 ప్రెస్ మీట్లో ఊరించాడు రాజమౌళి. ఆ విషయం ఏమిటా అన్న ఉత్సుకత నెలకొంది. ప్రభాస్ హాలీవుడ్ వెళ్తున్నాడని, అదే ఆ అదిరిపోయే న్యూస్ అనుకొన్నారు అభిమానులు. 5వ తారీఖున అంటూ ముందుగానే స్వీట్ న్యూస్ కన్ఫామ్ చేశాడు జక్కన్న. బాహుబలి ప్రభాస్ హాలీవుడ్ వెళ్లడం లేదుగానీ, అందుకు సరితూగే ఘనతే దక్కించుకోనున్నాడు. బ్యాంకాక్లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ విగ్రహాన్ని ప్రతిష్టింపచేయనున్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటే.. ప్రభాస్ విగ్రహాన్ని ఆవిష్కరించబోవడం నిజంగా గొప్ప విషయమే. ఈ ఘనత వహించిన తొలి భారతీయ నటుడు ప్రభాసే. రాజమౌళి చెబుతానన్న స్వీటెస్ట్ న్యూస్ కూడా ఇదే. మ్యూజియంకి సంబంధించిన స్టాట్యూ డిజైనర్స్ వచ్చి ప్రభాస్ మెజర్మెంట్స్ని తీసుకెళ్లారు. అతి త్వరలో బ్యాంకాక్ మ్యూజియంలో ప్రభాస్ నిలువెత్తు విగ్రహాన్ని చూడొచ్చన్నమాట. హాలీవుడ్ సినిమా, అవార్డు, పెళ్లి సంగతి అంటూ.. ఏవేవో ఊహించుకొన్న ప్రభాస్ అభిమానులకు ఈ వార్త అంత కిక్ ఇవ్వకపోయినా బ్యాంకాక్ మ్యూజియం విశిష్టత తెలిసినవాళ్లకు నిజంగా ఇది గ్రేట్ న్యూసే.