ఖుషి సినిమాలోని పాటలన్నీ హిట్టే. అందులో ‘ఏ మేరా జహా..’ అనే పాటైతే ఇంకా సూపర్ హిట్టు. తెలుగు సినిమాలో పూర్తి స్థాయి హిందీ పాట వినిపించడం అదే తొలిసారి. అక్కడి నుంచి అదో ట్రెండ్గా మారింది. ఈ పాట వెనుక ఓ రహస్యాన్ని పవన్ కల్యాణ్ బయట పెట్టాడు. ‘ఛల్ మోహన రంగ’ ఆడియో ఫంక్షన్లో. ఈ పాట చేసింది.. తమన్ అట. వింటుంటే మనకు ఆశ్చర్యంగా ఉంది కదా. దాని గురించి పవన్ ఏమన్నాడంటే..
”ఖుషిలో ఏ మేరా జహా పాట చాలా పెద్ద హిట్టయ్యింది. ఆ పాట వెనుక తమన్ ఉన్నారు. నాకో హిందీ పాట కావాలి అని మణిశర్మని అడిగినప్పుడు ఆ బాధ్యతంతా తమన్ పై పెట్టారు మణిశర్మ. తను చాలా బాగా తీర్చిదిద్దాడు. ఆ పాట చాలా పెద్ద హిట్టయ్యింది… ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాలోనూ తమన్ మంచి పాటలు ఇచ్చారు” అంటూ తమన్కి మర్చిపోలేని కితాబు ఇచ్చాడు పవన్. ఎవరి సపోర్ట్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగిన తన వీరాభిమాని నితిన్నీ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ”ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత దూరం రావడం, చిత్రసీమలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. నితిన్కి ఓ మోరల్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు `ఇష్క్` ఆడియో ఫంక్షన్కి నేను వచ్చా” అంటూ అప్పటి రోజుని గుర్తు చేశాడు.