‘సరిపోదా శనివారం’ తరవాత వివేక్ ఆత్రేయ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. అయితే.. ఈమధ్యలో ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఓ కథ చెప్పారు. దాదాపుగా ఈ కాంబో ఓకే అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ.. కొరటాల కథని ఓకే చేశారు బాలయ్య. కొరటాల ప్రాజెక్ట్ ముందుకు రావడంతో, కాస్త ఆలస్యంగా అయినా వివేక్ ఆత్రేయ సినిమా పట్టాలెక్కుతుందనుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లేనట్టే. బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో సినిమాకు అవకాశాలు పూర్తిగా క్లోజ్ అయినట్టే అని తెలుస్తోంది.
ఆ తరవాత వివేక్ ఆత్రేయ… రవితేజకు కథ చెప్పడం, ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయాయి. వివేక్ ఆత్రేయ తదుపరి సినిమా రవితేజతోనే. ఇందులో మరో మాటకు తావులేవు. కాకపోతే.. బాలయ్య కోసం రాసుకొన్న కథ అయితే ఇది కాదు. రవితేజ కోసం వివేక్ మరో కథ రాశారు. అది ఫైనల్ అయ్యింది.
ప్రస్తుతం ‘ఇరుముడి’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. తండ్రీ కూతుర్ల నేపథ్యంలో సాగే సినిమా ఇది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకొంటాయని చిత్రబృందం చెబుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియ భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది.
