వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నగరి నియోజకవర్గంలో అల్టిమేట్ లీడర్ను తానేనని ఎమ్మెల్యే రోజా మరోసారి నిరూపించుకున్నారు. వివాదాస్పదమైన నిండ్ర మండలాధ్యక్ష పదవిని తన వర్గానికే ఇప్పించుకున్నారు. దీంతో రోజా ప్రత్యర్థివర్గం అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు షాక్ తగిలినట్లయింది. మండల పరిషత్ ఎన్నికల్లో నిండ్ర మండలలో వైసీపీ ఘన విజయం సాధించింది. అయితే అక్కడ మండలాధ్యక్షుడిగా శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి ఎన్నిక కావాలనుకున్నారు.
కానీ నగరి ఎమ్మెల్యే మాత్రం ఆయన కాకుండా దీప అనే ఎంపీటీసీని ఖరారు చేశారు. కానీ పెద్దిరెడ్డి వర్గీయులు అంగీకరించలేదు. నిండ్ర మండలంలో పట్టు తమదే కాబట్టి తామే ఎంపీపీగా ఉంటామన్నారు. రోజాను లెక్కలోకి తీసుకోలేదు. ఆమెనే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. చివరికి ఈ విషయాన్ని రోజా హైకమాండ్ వరకూ తీసుకెళ్లింది. ఎమ్మెల్యే సూచించిన మేరకే నడుచుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో పెద్దిరెడ్డి వర్గీయులు వెనక్కి తగ్గక తప్పలేదు.
నిండ్ర మండలంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కుమారుడైన చక్రపాణిరెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. ఆయనకు పెద్దిరెడ్డి ఆశీస్సులు ఉన్నాయి. రోజాకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోవాలని అనుకుంటున్నారు. కానీ వారు బలపడకుండా రోజా హైకమాండ్ దగ్గర్నుంచి పనులు చక్క బెట్టుకొచ్చారు.