శ్రీదేవి మరణకథ (కేసు) ముగిసింది!

డబ్భై గంటలుగా ఎడతెగని ఉత్కంఠకు దుబాయ్ పోలీసులు తెరదించారు. శ్రీదేవి మరణకథ (కేసు)కి దుబాయ్ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ముగింపు పలికింది. చట్ట ప్రకారం కేసు ముగిసింది గానీ కోట్లాది శ్రీదేవి అభిమానుల్లో అనుమానాలు తొలగలేదు. “సృహ కోల్పోవడంతో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించారు. ఇక, ఈ కేసు ముగిసింది. ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం దుబాయ్ పోలీసులు, దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విచారణ చేశారు” అని దుబాయ్‌ మీడియా సెంటర్‌ ట్విట్టర్లో పేర్కొంది. దాంతో శ్రీదేవి మృతిపై ఏకబిగిన మీడియాలో వ్యక్తమవుతున్న కథనాలకు, ప్రజల అనుమానాలకు చెక్ పడినట్లయింది. దుబాయ్ పోలీసులు శ్రీదేవి కేసు క్లోజ్ చేయడంతో భౌతికకాయం ఇండియా తీసుకురావడానికి కుటుంబ సభ్యులకు అనుమతులు లభించాయి. వారు దుబాయ్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబ‌య్‌కి బయల్దేరారు. బోనీ కపూర్‌తో పాటు కుమారుడు అర్జున్ కపూర్, ఇతరులు ఆ విమానంలో వున్నారు. మంగళవారం రాత్రి విమానం ముంబ‌య్‌కి చేరుకుంటుంది.

బుధవారం శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలుత భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సమీపంలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌కి తీసుకువెళతారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ అక్కడ వుంచుతారు. అనంతరం రెండు గంటలకు అంతిమ యాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు అంతిమ యాత్ర విలే పార్లే సేవా సమాజ్‌ హిందూ శ్మశానవాటికకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.