లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన n) అంశంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపాయి. తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చారనే ఆరోపణలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
లోక్సభలో తాను చేసిన ప్రసంగాన్ని కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని తేజస్వి సూర్య మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును తాను ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని, కేవలం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విభజన తీరును మాత్రమే ఎండగట్టానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఆ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను నేను కించపరచలేదు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాన్ని, విభజన సమయంలో వారు వ్యవహరించిన అప్రజాస్వామిక తీరును మాత్రమే ప్రస్తావించానని తెలిపారు. తన మాటలను రాజకీయ లబ్ధి కోసం తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద వారు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం కోట్లాది మంది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వారు విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ రెడ్డి వంటి నేతలు తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆయనపై పార్లమెంటరీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తేజస్వీ సూర్య వివరణతో వ్యవహారం సద్దుమణిగినట్లు అయింది.


