బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు కానీ..అందర్నీ ఒకే సారి చేర్చుకుని షాకివ్వాలని అనుకోవడం లేదు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ఎల్పీ విలీనం పూర్తి చేసి.. కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని అనుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడొక ఎమ్మెల్యే.. ఇక్కడొక ఎమ్మెల్యే తప్ప.. అందరూ కలసి కట్టుగా వచ్చి చేరే అవకాశాలు కనిపించడం లేదు.
ఇప్పటికే నలుగురు మాత్రమే కాంగ్రెస్ లో చేరినట్లు. తెల్లం వెంకట్రావు , దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రమే పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్..ఇవాళో రేపో చేరుతారు. నిజానికి ఇతర ఎమ్మెల్యేలు అంతా కలసి కట్టుగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలు చేశారు. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు చేసిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నట్లుగా ప్రచారం చేశారు. కానీ వారు భేటీలకు హాజరై.. తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారో లేదో స్పష్టత లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంక్ ను కూడా నిలుపుకోవడానికి కష్టపడితే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేల తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది. అయితే వారి చాయిస్ కాంగ్రెస్ నా బీజేపీనా అన్నది కూడా ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే ఉండవచ్చు.